అల్లూరి జిల్లా పున్నమి న్యూస్ ప్రతినిధి జి. కె. వీధి అక్టోబరు 30:
అల్లూరి జిల్లా జి.కె. వీధి మండలం, రింతాడ పంచాయతీలోని ఈదులబంధ, తీముల బంధ గ్రామాలలో ముంథా తుఫాను నేపథ్యంలో సంభవించిన భారీ వర్షాలు, గాలుల కారణంగా ఇల్లు కోల్పోయి నష్టపోయిన కుటుంబాలను జనసేన నాయకులు పరామర్శించారు. సోషల్ మీడియాలో ఈ సమాచారం వైరల్ కావడంతో, జనసేన నాయకులు గొర్లె వీరవెంకట్ ఆధ్వర్యంలో నష్టం జరిగిన కుటుంబాలైన గమ్మెలి నీలన్న, కొర్ర చిన్నమ్మి, కొర్ర రఘునందన్ నివాసాలకు వెళ్లి, వారి ఇళ్ల పైకప్పులు, గోడలకు జరిగిన నష్టాన్ని పరిశీలించారు.నష్టపోయిన కుటుంబాలకు వారు ధైర్యాన్ని చెప్పి, వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా కొర్ర చిన్నమ్మి పరిస్థితిని గమనించిన వీరవెంకట్, తక్షణ సహాయంగా ఆమెకు కొన్ని నిత్యవసర సరుకులను అందించారు.మరోవైపు, ఈ విషయం తెలుసుకున్న అధికార యంత్రాంగం కూడా తక్షణమే స్పందించి, అధికారులను సంఘటనా స్థలానికి పంపారు. అధికారులు నష్టాన్ని అంచనా వేసి, విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారని, ప్రభుత్వం కచ్చితంగా స్పందించి బాధితులకు న్యాయం చేస్తుందని జనసేన నాయకులు తెలిపారు.ఈ పరామర్శ కార్యక్రమంలో టీడీపీ క్లస్టర్ ఇంచార్జ్ వడేలు పాండురాజు, జనసేన ప్రధాన కార్యదర్శి గబులంగి గణేష్, జనసేన పార్టీ ఉపాధ్యక్షులు అనిల్, తాడి రమేష్, పీసా ఉపాధ్యక్షులు గెమ్మెలి కోటిబాబు తదితరులు పాల్గొన్నారు.


