*గత జగన్ ప్రభుత్వం యాజమాన్యాలను బ్లాక్ మెయిల్ చేసిందుకే జీవోలు తెచ్చింది.*
ఎన్టీఆర్ జిల్లా (పున్నమి ప్రతినిధి)
సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలు (ఎం.ఎస్.ఎం.ఈ) పాలసీలోని లోపాలను సవరించాలని, గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పరిశ్రమల యాజమాన్యాలను చెప్పు చేతల్లో పెట్టుకుని బ్లాక్మెయిల్ చేసేందుకు కొన్ని జీవోలను చేసిందని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో ఏపీ ఎం.ఎస్.ఎం.ఈ ఎంటర్ ప్రెన్యూర్ డెవలప్మెంట్ పాలసీపై ఉపాధి అవకాశాలు, పరిశ్రమల గురించిన లఘు చర్చలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ శుక్రవారం మాట్లాడారు. వన్ ఎంటర్ ప్రెన్యూర్ వన్ పాలసీలోని పలు లోపాలను ఆయన ప్రస్తావించారు.
ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ‘వన్ ఎంటర్ ప్రెన్యూర్ వన్ పాలసీ, జీవో నెంబరు 69లో కొన్ని లోపాలు ఉన్నాయి. ఎం.ఎస్.ఎం.ఈలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే టెండర్లలో లోకల్ ప్రొక్యూర్ మెంట్ కింద 25 శాతం పర్చేజ్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. కానీ దీనివల్ల వారికి ఉపయోగం ఏమి లేదు. ఎందుకంటే పెద్ద సంస్థలు టెండర్లలో పాల్గొన్నప్పుడు ఎం.ఎస్.ఎం.ఈలు పోటీ పడగలిగే పరిస్థితి ఉండదు.
కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు 25 శాతం ప్రోక్యూర్ మెంట్ స్థానిక ఎం.ఎస్.ఎం.ఈలకు ఇవ్వాలి. అలాగే ఎల్ 1 ఎవరైతే ఉన్నారో వారికంటే ప్రైస్ లో 15 శాతం లోకల్ గా ఉన్న ఎం.ఎస్.ఎం.ఈలకు తగ్గించి ఇవ్వాలి. ఎం.ఎస్.ఎం.ఈలకు స్థానికంగా ఉన్న వారికి ప్రైస్ కూడా ప్రాధాన్యత ఇచ్చి, రిబేటు ఇవ్వాలి. దీనివల్ల స్థానికంగా పరిశ్రమలు పెరిగి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
గత ప్రభుత్వ జీవోలో సవరణ అవశ్యం.
స్థానికులకు పరిశ్రమల్లో 75% ఉద్యోగాలు ఇవ్వాలని, 25 శాతం బయట రాష్ర్టాల వారిని తీసుకోవాలని గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేకంగా జీవో ఇచ్చింది. స్థానికంగా కార్మికుల లభ్యత ఉంటే బయట నుంచి ఉద్యోగులను తెచ్చుకోవాలని ఏ యాజమాన్యం కోరుకోదు. కేవలం పరిశ్రమల యాజమాన్యాలను చెప్పు చేతుల్లో పెట్టుకొని, బ్లాక్ మెయిల్ చేసేందుకు అప్పట్లో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉద్దేశ్య పూర్వకంగా ఈ జీవో ఇచ్చింది. ఈ నిబంధన కింద గత ప్రభుత్వం హయంలో కూడా ఎక్కడ ఒక కేసు కూడా నమోదు కాలేదు. దీనివల్ల అధికారులు పరిశ్రమలపై బ్లాక్ మెయిల్ చేసేందుకు అవకాశం ఉంది. దయచేసి ఈ నిబంధన తొలగించాలి.
నూతన ఇండస్ట్రియల్ పాలసీలో గైడ్లైన్స్ లో స్పష్టత లేని కారణంగా జిల్లా స్థాయిలో నిర్వహించాల్సిన సమావేశాలు నిలిచిపోయాయి. ఎస్.ఎల్.సిలు కూడా సమావేశాలు జరగడం లేదు. వీటన్నింటినీ సరిదిద్దుకోవాలి.
20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది. ఇదే కర్తవ్య దీక్షతో ఏపీ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ లక్ష్యాలు సాధించాలంటే స్థానికంగా ఉన్నటువంటి ఎం.ఎస్.ఎం.ఈలను ప్రోత్సహించాలి. వీరికి కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 25 శాతం ప్రాధాన్యత ఇచ్చి, రేటులో కూడా ఎల్ 1 కంటే 15 శాతం తగ్గించి ఇవ్వాలి. తద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు పరచాలి.’ అని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పేర్కొన్నారు.


