*గంటా గ్రీవెన్స్ లో ఎమ్మెల్యే కొండ్రు మురళి*
*సమస్య పరిష్కరించాలని విజ్ఞప్తి*
_*విశాఖపట్నం డిసెంబర్ 18పున్నమి ప్రతినిధి*:_ భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గురువారం మధురవాడ జోనల్ ఆఫీస్ లో నిర్వహించిన గ్రీవెన్స్ లో తన సమస్య తెలియజేయడానికి రాజాం ఎమ్మెల్యే కొండ్రు మురళీ మోహన్ హాజరు కావడం అందరి దృష్టిని ఆకర్షించింది. మురళీకి పీఎం పాలెంలో బాబా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ (బిట్స్) కాలేజీ ఉంది. దీనికి సమీపంలోని స్మశానం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రీవెన్స్ లో గంటా దృష్టికి మురళీ తీసుకువచ్చారు. స్మశానానికి ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించాలని కోరారు. ఈ విషయాన్ని పరిశీలించి శ్మశాన వాటికను ప్రత్యామ్నాయ స్థలానికి మార్చే అవకాశాన్ని పరిశీలించాలని అధికారులకు గంటా శ్రీనివాసరావు సూచించారు. ఎండాడ, మధురవాడ తదితర ప్రాంతాల్లో బడ్డీలు తొలగించడం వల్ల 20 ఏళ్ల నుంచి ఉపాధి పొందుతున్న చిరు వ్యాపారులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేస్తూ వినతి పత్రాన్ని అందించారు. డ్రెయిన్లు, రోడ్లు కావాలని.. స్మశానాన్ని అభివృద్ధి చేయాలని.. తాగునీటి సమస్యకు పరిష్కారం చూపించాలని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు కోరారు. కార్యక్రమంలో ఇంచార్జ్ జోనల్ కమిషనర్ అయ్యప్ప నాయుడు, చిక్కాల విజయ్ బాబు, కార్పొరేటర్లు లొడగల అప్పారావు, పిల్లా మంగమ్మ, మొల్లి హేమలత, పి.వి.నరసింహం, జీవీఎంసీ అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.


