అక్టోబర్ 1 (పున్నమి ప్రతినిధి)
ఆంధ్రప్రదేశ్లో మహిళా పోలీసులకు ప్రభుత్వం బంపరాఫర్ ఇచ్చింది. వారు తమకు నచ్చిన శాఖను ఎంచుకోవచ్చు.. హోం శాఖలో పనిచేయాలనుకుంటున్నారా, లేక మహిళా శిశు సంక్షేమ శాఖలో పనిచేయాలనుకుంటున్నారా అని వారే నిర్ణయించుకోవాలి.
ప్రభుత్వం మహిళా పోలీసుల ఇష్టానికే ఈ అవకాశం ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 13,500 మంది మహిళా పోలీసులు గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వం వారి నుంచి అభిప్రాయాలను సేకరిస్తోంది. రెండు రోజుల్లో ఈ వివరాలు వస్తాయి.. ఆ తర్వాత పదోన్నతుల మార్గాన్ని ఖరారు చేస్తారు.
అంతేకాదు రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాయాల్లో పనిచేస్తున్న మహిళా పోలీసులకు విధులు ఎలా కేటాయించాలి అనే దానిపై కూడా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అందుకే మంత్రులతో కమిటీని ఏర్పాటు చేయగా.. ఆ కమిటీ ఇప్పటికే ఈ అంశంపై చర్చించింది. ముఖ్యంగా, మహిళా శిశు సంక్షేమ శాఖను ఎంచుకునే వారికి పదోన్నతులు ఎలా కల్పించాలి అనే అంశంపై అధికారులు కూడా దృష్టి పెట్టారు. ఈ మేరకు దీనిపై ప్రభుత్వానికి ఒక నివేదిక కూడా పంపారు. త్వరలోనే ఈ అంశాలపై క్లారిటీ రానుంది.
గత ప్రభుత్వ హయాంలో గ్రామ, వార్డు సచివాయాల్లో ప్రత్యేకంగా మహిళా పోలీసుల్ని నియమించిన సంగతి తెలిసిందే. అయితే మహిళా పోలీసుల అంశంపై చాలాకాలం వివాదం నడిచింది. మహిళా పోలీసుల్ని హోంశాఖ పరిధిలోకి తీసుకెళ్లి వారికి కూడా పోలీస్ యూనిఫామ్ ఇవ్వాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అంశంపై హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. అయితే 2024 ఎన్నికల తర్వాత ఏపీలో ప్రభుత్వం మారడంతో మహిళా పోలీసులకు ఎలాంటి విధులు అప్పగించాలనే అంశంపై కసరత్తు చేస్తున్నారు. మహిళా పోలీసుల్ని హోంశాఖలో కానీ, మహిళా శిశు సంక్షేమ శాఖలో కానీ పనిచేసేలా ఆప్షన్స్ ఇచ్చింది ప్రభుత్వం. ఈ మేరకు ఏపీ సర్కార్ ఈ అంశంపై ఫోకస్ పెట్టింది. మరి ప్రభుత్వం మహిళా పోలీసులకు ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ మహిళా శిశు సంక్షేమ శాఖను ఎంపిక చేసుకున్న వారికి పదోన్నతులు ఎలా అన్నది చూడాలి.


