ఖమ్మం మార్చి
(పున్నమి జిల్లా ఇంచార్జి )
హైదరాబాద్లోని డా. బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో విపత్తుల నిర్వహణ విభాగం, ఫైర్ సర్వీసెస్, ఎస్డిఆర్ఎఫ్, హైడ్రా, ఐసిసిసి విభాగాల అధికారులతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, విపత్తులు సంభవించిన తర్వాత సహాయక చర్యలకే పరిమితం కాకుండా ముందస్తు సన్నద్ధతతో నష్టాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకోవాలని పేర్కొన్నారు. ఈ క్రమంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ‘స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్’ (SIDM) ఏర్పాటు కోసం అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
దీనికోసం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఈ ప్రతిపాదనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
తెలంగాణను విపత్తుల నిర్వహణలో దేశానికి ఆదర్శంగా నిలిపేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి స్పష్టం చేశారు. అగ్నిప్రమాదాలు సహా అన్ని రకాల విపత్తులను ఎదుర్కొనేందుకు రియల్ టైమ్ మానిటరింగ్ వ్యవస్థ, ఆధునిక పరికరాలు, డ్రోన్లు, హైస్పీడ్ బోట్లు వంటి సదుపాయాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ సమావేశంలో విపత్తుల నిర్వహణ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి దాన కిశోర్, అగ్నిమాపక శాఖ డైరెక్టర్ విక్రమ్ సింగ్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఐసిసిసి డైరెక్టర్ కమలాసన్ రెడ్డి, స్పెషల్ పోలీస్ బెటాలియన్ అదనపు డీజీ సంజయ్ జైన్ తదితరులు పాల్గొన్నారు.


