Thursday, 12 February 2026

Tag: Ramagundam

తెలంగాణ పెద్దపల్లి వరంగల్

తెలంగాణ రాష్ట్ర స్థాయిలో బంగారు పతకం సాధించిన పోలీస్ డాగ్

రామగుండం పోలీస్ కమీషనరేట్ నార్కోటిక్ డాగ్ “సింబా” ఎంపిక రామగుండం, ఆగస్టు 04, పున్నమి ప్రతినిధి: వరంగల్ జిల్లా మమునూరు పిటిసిలో జరిగిన తెలంగాణ రాష్ట్ర రెండవ పోలీస్ డ్యూటీ మీట్ లో కాళేశ్వరం జోన్ నుండి నార్కోటిక్ డాగ్ విభాగం పోటీలో పాల్గొనీ గంజాయి, మత్తు పదార్థాలను గుర్తించడం లో పోలీసు జాగిలం సింబా, డాగ్ హ్యాండ్లర్ ఏ ఆర్ హెడ్ కానిస్టేబుల్ ఎం. వేణుగోపాల్ కృష్ణ గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. అదేవిదంగా రాష్ట్ర స్థాయిలో ఉత్తమ పోలీస్ డాగ్ గా “సింబా” ఎంపిక కావడం జరిగింది. సోమవారం రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా తమ కార్యాలయంలో నార్కోటిక్ డాగ్ సింబా, డాగ్ హాండ్లర్ ను అభినందించడం జరిగింది. 2026 సంవత్సరం ఫిబ్రవరిలో పూణేలో జరిగే నేషనల్ పోలీసు డ్యూటీ మీట్ లో పాల్గొని మరిన్ని పతకాలు సాధించాలని తెలంగాణ రాష్ట్రానికి, రామగుండం పోలీస్ కమీషనరేట్ కి మంచి పేరు తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్, పెద్దపల్లి డీసీపీ పి. కరుణాకర్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఆర్ఐ లు దామోదర్, శ్రీనివాస్, వామన మూర్తి, సంపత్, మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ పిల్లలకు పెద్దపల్లి

ప్రతి స్కూల్ బస్సులోను తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలను అమర్చాలి.

*డ్రైవర్స్ ఏ చిన్న తప్పు చేసినా.. స్కూల్ యాజమాన్యందే బాధ్యత.* *ప్రతి స్కూల్ బస్సులోను తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలను అమర్చాలి.* *_పెద్దపల్లి డీసీపీ కరుణాకర్_* రామగుండం, జులై 30, పున్నమి ప్రతినిధి:  పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని అడ్డగుంటపల్లి లోని ఆద్య బ్యాంకెట్ హాల్ లో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్ర సేనా రెడ్డి ఆధ్వర్యంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్, గోదావరిఖని సబ్ డివిజన్ పరిధిలోని స్కూల్, కళాశాల యజమానులు, బస్ డ్రైవర్లకు బుధవారం అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్ లు ముఖ్య అతిథులుగా హాజరై, పలు ఆదేశాలు, సూచనలు చేశారు. స్కూల్, కళాశాలల యాజమాన్యాలు నైపుణ్యం గల డ్రైవర్లను నియమించుకోవాలని, పిల్లలను బస్సు ఎక్కించేటప్పుడు, దించేటప్పుడు నిర్దేశించిన ప్రదేశాల్లో మాత్రమే బస్సులను నిలుపుదల చేయాలన్నారు. డ్రైవర్లు ఓవర్ టేకింగ్ చేయవద్దని సూచించారు. బస్సు డ్రైవర్లు మద్యం సేవించి, సెల్ఫోన్లు ఉపయోగించినట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బస్ లలో ఫస్ట్ ఎయిడ్ కిట్, ఫైర్ సిలిండర్ తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలన్నారు. బస్సులో సీట్లకు సరిపడా విద్యార్థులను మాత్రమే తీసుకెళ్లాలని డీసీపీ పేర్కొన్నారు. స్కూల్ బస్సు డ్రైవర్ లకు పోలీస్ వారి తరుపున ముఖ్యమైన సూచనలు చేశారు. పిల్లల భద్రత కోసం డ్రైవర్లు ట్రాఫిక్ నియమాలను పాటించాలని, విద్యార్థులను ఎక్కించేటప్పుడు, బస్సు దించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, బస్సును క్రమం తప్పకుండా ప్రతి రోజూ తనిఖీ చేయాలని తెలిపారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద, మూల మలుపుల వద్ద, ప్రధాన కూడల్ల వద్ద వేగాన్ని నియంత్రించాలని, విద్యార్థుల భద్రత కోసం బస్  పూర్తిగా ఆగిన తరువాత పిల్లలను ఎక్కించడం, దించడం కోసం ఒక వ్యక్తిని విద్యార్థులకు సహాయంగా ఏర్పాటు చేయాలని, టైర్లు, బ్రేక్లు, ఇతర ముఖ్యమైన భాగాలను పరిశీలించాలని, ఏవైనా సమస్యలు ఉంటే, వాటిని యాజమాన్యం కు చెప్పి వెంటనే పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థులను అప్రమత్తంగా ఉంచడం కోసం విద్యార్థులకు బస్సు భద్రతా నియమాల గురించి అవగాహన కల్పించాలని, బస్సులో ప్రవర్తన ఎలా ఉండాలో వారికి చెప్పాలని కోరారు. విద్యార్థులు బస్సులో సురక్షితంగా ప్రయాణించేందుకు బాధ్యత వహించాలనే విషయం గుర్తుంచుకోవాలని, మొదటగా ప్రథమ చికిత్స కిట్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలని,  బస్సులో అగ్నిమాపక యంత్రం అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. డ్రైవింగ్ చేసేటప్పుడు ఎటువంటి ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా ఉండాలని, సమయపాలన పాటిస్తూ సమయానికి బస్సును నడపడానికి ప్రయత్నించాలని, విద్యార్థులతో ఓపిక, సహనంగా ఉంటూ మంచి ప్రవర్తనతో ఉండాలని, పిల్లలకు ఏదైనా సమస్య తలెత్తితే, దానిని పరిష్కరించడానికి, యాజమాన్యం, తల్లితండ్రుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం కోసం ప్రయత్నించాలని, అవసరమైనప్పుడు తగినంత విశ్రాంతి తీసుకోవాలని, బస్సులో భద్రత ప్రాముఖ్యతను విద్యార్థులకు అవగాహన కల్పించాలని పలు కీలక సూచనలు చేశారు. డ్రైవర్లు మద్యం మత్తులో స్కూల్ బస్సులు నడిపినట్లు గుర్తిస్తే అలాంటి వారిపై ఎట్టి పరిస్థితుల ఉపేక్షించేది లేదని కఠిన చర్యలు తీసుకుంటామని, ఏదైనా ప్రమాదం జరిగితే స్కూల్ యాజమాన్యం పైన కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదానికి కారణమైన వ్యక్తులపై నమోదు చేయు కేసులు, శిక్షల గురించి వివరించారు. అతివేగంగా అజాగ్రత్తగా వాహనాన్ని నడిపి ప్రమాదానికి గురి చేయడం వలన మరణం సంభవిస్తే – 106(1) BNS [304-A IPC], సిగ్నల్ జంప్ చేసిన సందర్భం, రాంగ్ రూట్ లో వెళ్ళిన సందర్భంలో మరణం సంభవిస్తే, బలమైన సందర్భంలో – 105 BNS [304(ii) IPC], అతివేగంగా అజాగ్రత్తగా వాహనాలు నడిపి ఒక వ్యక్తికి – సాధారణ గాయాలు అయిన సందర్భంలో – 125(a) BNS [337 IPC], బలమైన గాయాలు అయిన సందర్భంలో –  125(b) BNS [338 IPC], పట్టణ ప్రాంతంలో, రద్దీ ప్రదేశాలలో, సాధారణ సమయంలో అతివేగంగా అజాగ్రత్తగా వాహనాలు  నడిపినచో సాధారణ గాయాలు అయిన సందర్భంలో – 125 BNS [336 IPC], బలమైన గాయాలు అయిన సందర్భంలో – 281 BNS [279 IPC], మైనర్ కి వాహనం ఇచ్చి ప్రమాదానికి గురి చేసినట్లయితే – 180 MV Act, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపినట్లయితే – 3 r/w 181 MV Act, మద్యం తాగి వాహనం నడినట్లయితే – 185 MV Act, ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడిపినట్లు అయితే – 196 MV Act, సెక్షన్ల ప్రకారం చట్ట రీత్యా చర్యలు తీసుకుంటామని వివరించారు. ఈ కార్యక్రమంలో గోదావరిఖని ఏసిపి ఎం. రమేష్, గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, గోదావరిఖని టూ టౌన్ ఇన్స్పెక్టర్ ప్రసాదరావు, మంథని సీఐ రాజు, రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మధు, గోదావరిఖని వన్ టౌన్ ఎస్ఐలు రమేష్, భూమేష్ అనూష, ఎన్టిపిసి ఎస్ఐ ఉదయ్ కిరణ్, రామగుండం ఎస్ఐ సంధ్యారాణి, అంతర్గాం ఎస్సై వెంకటేష్, కమాన్పూర్ ఎస్సై ప్రసాద్, రామగిరి ఎస్సై శ్రీనివాస్, మంథని ఎస్ఐ రమేష్, ముత్తారం ఎస్సై నరేష్, స్కూల్స్ కళాశాల ప్రిన్సిపల్స్, డ్రైవర్స్, తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ పెద్దపల్లి

లంచం డిమాండ్ చేసిన పారిశుద్ధ్య కార్మికులను విధుల నుంచి తోలగింపు

*లంచం డిమాండ్ చేసిన పారిశుద్ధ్య కార్మికులను విధుల నుంచి తోలగింపు* *_పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష_* రామగుండం, జులై 25, పున్నమి ప్రతినిధి: లంచం డిమాండ్ చేసిన ఔట్ సోర్సింగ్ పారిశుధ్య కార్మికులను విధుల నుంచి తొలగిస్తూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని జనరల్ ఆసుపత్రి లో శుక్రవారం ఆకస్మిక తనిఖీ సమయంలో ఆసుపత్రిలో ఔట్ సోర్సింగ్ ఏజేన్సీ ద్వారా పారిశుధ్య కార్మికులుగా విధులు నిర్వహిస్తున్న హనుమంతు, లావణ్య రోగుల నుంచి లంచం డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, డబ్బులు ఇవ్వని పేషెంట్ బెడ్ల వద్ద క్లీనింగ్ చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు రోగుల ఫిర్యాదు ద్వారా తెలుసుకున్న కలెక్టర్ వెంటనే సంబంధిత ఔట్ సోర్సింగ్ సిబ్బంది సర్వీసులను టెర్మినెట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఔట్ సోర్సింగ్ పారిశుద్ధ్య సిబ్బంది హనుమంతు, లావణ్య లను ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో అనుమతించడానికి వీలులేదని కలెక్టర్ గోదావరిఖని జనరల్ ఆసుపత్రి వైద్య సూపరింటెండెంట్ ను ఆదేశించారు. పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య వసతులను పూర్తి ఉచితంగా అందించాలని లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తుంటే ఇటువంటి ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఆ లక్ష్యానికి తూట్లు పొడుస్తూ, పేద రోగులను ఇబ్బందులకు గురి చేస్తూ, జిల్లా యంత్రాంగానికి అవమానకర పరిస్థితులు తీసుకువచ్చారని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగుల దగ్గర నుంచి డబ్బులు డిమాండ్ చేసే సిబ్బంది ఇంకా ఎవరైనా ఉంటే గుర్తించి విధుల నుంచి తొలగించాలని, లేనిపక్షంలో ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ లైసెన్సు రద్దు చేయడం జరుగుతుందని కలెక్టర్ సంబంధిత ఏజెన్సీ వర్గాలను హెచ్చరించారు.

తెలంగాణ పెద్దపల్లి

అంతర్గాం మండలంలో విస్తృతంగా పర్యటించిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష

*అంతర్గాం మండలంలో విస్తృతంగా పర్యటించిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* అంతర్గాం, జులై 17, పున్నమి ప్రతినిధి: పాఠశాల ప్రాంగణాలను పరిశుభ్రంగా ఉంచాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. గురువారం పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. అంతర్గాం మండలం మద్దిరాల గ్రామంలోని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు, అంగన్వాడీ కేంద్రం, మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, పోట్యాల గ్రామంలోని ఎంపీపీఎస్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, బ్రాహ్మణపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, గోలివాడ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రాధాన్యత కల్పించాలని, పాఠశాల ఆవరణలో గడ్డి, పిచ్చి మొక్కలు పెరగకుండా జాగ్రత్త వహించాలని ఆదేశించారు. పాఠశాలల్లోని పిల్లలకు విష జ్వరాలు రాకుండా చూసుకోవాలని కలెక్టర్ సూచించారు. ‌పాఠశాలలకు ఎటువంటి సమస్యలు వచ్చిన వెంటనే స్పందించి అవసరమైన చర్యలు తీసుకోవాలని, రాబోయే 5 సంవత్సరాల పాటు ఎటువంటి అవసరాలు లేకుండా పాఠశాలల్లో మౌలిక వసతుల ఏర్పాటుకు ప్రతిపాదనలు అందించాలని, వాటిని వెను వెంటనే పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మద్దిరాల గ్రామంలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేసుకోవాలని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అవసరమైన సంపూర్ణ సహకారం అధికారులు అందించాలని కలెక్టర్ పలు సూచనలు చేశారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట అంతర్గాం ఎంపీడీఓ వేణుమాధవ్, హౌసింగ్ ఈఈ రాజేశ్వర్, హౌసింగ్ డీఈ దస్తగిరి, పంచాయతీ రాజ్ డీఈ అప్పల నాయుడు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.