E-పేపర్
ఆదిలాబాదు
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
తెలంగాణ
నిర్మల్
నిర్మల్ జిల్లా 26-ఆగస్ట్ (పున్నమి ప్రతినిధి) (గైని భోజన్న):- వేదమంత్రాల సాక్షిగా ఏడు అడుగులు వేసి కలకాలం ఒకరికొకరు తోడుంటామని చెప్పి పెళ్లితో ఒక్కటయ్యే భార్య భర్తల జీవితం మనిషి జన్మలో మలుపు తిప్పే మరో అద్భుత ఘట్టం అని అంటారు. కానీ నేటి కాలంలో జరుగుతున్న భర్తలను భార్యలు హత్య చేస్తున్న ఘటనలు చూస్తుంటే సమాజం అసలు ఎటువైపు వెళుతుందో ఎవరికి అంత చిక్కడం లేదని చెప్పక తప్పడం లేదు. అక్రమ సంబంధానికి అడ్డుగా నిలిచాడన్న నెపంతో తన భార్యే తన చావుకు కారణం అవుతుందని తను అనుకోకుని ఉండకపోవచ్చు అలా తన భార్యే భర్తను చంపిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. ఇక వివరాల్లోకి వెళితే నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని వెల్మల్ గ్రామానికి చెందిన హరి చరణ్, నాగలక్ష్మి దంపతులు అన్యోన్య దాంపత్యాన్ని గడిపినప్పటికీ మూడో వ్యక్తి వారి జీవితంలోకి అడుగు పెట్టాడు. దీంతో భర్త హరిచరణ్ భార్య మరియు తర్వాత వచ్చిన ఆ మూడో వ్యక్తి ద్వారా చనిపోతాడని అనుకోలేదు కాబోలు. ఎందుకంటే భార్య నాగలక్ష్మి కి అదే గ్రామానికి చెందిన మహేష్ అనే ఆ మూడో వ్యక్తి పరిచయమయ్యాడు. పరిచయం కాస్త వారి మధ్య అక్రమ సంబంధానికి దారి తీయడంతో అడ్డుగా ఉన్న భర్త హరిచరణ్ ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని అనుకున్న భార్య నాగలక్ష్మి, తన ప్రియుడు మహేష్ తో కలిపి ఈనెల 22వ తేదీన భర్త మెడకు టవల్ ఉరివేసి చంపి బాత్రూం లో మూర్ఛ వ్యాధి వచ్చి చనిపోయి ఉండవచ్చని అందరినీ నమ్మించింది. కట్ చేస్తే విషయం తెలుసుకున్న కొడుకు కృష్ణ తండ్రి మరణ వార్త వినగానే హుటాహుటిన అంత్యక్రియలకు హాజరయ్యాడు. తండ్రి చనిపోయాడు అని మాత్రమే తెలుసుకున్న కృష్ణకి విషయం అర్థం కాకపోవడంతో అంత్యక్రియలు సైతం నిర్వహించుకున్నారు. ఎప్పుడు ఆనందంగా నవ్వుతూ మాట్లాడే తన తండ్రి హరిచరణ్ కి మూర్ఛవ్యాధి లేకపోవడం అది కూడా బాత్రూంలో మూర్చ వ్యాధి రావడం ఏంటని ఆలోచించినా కృష్ణ తన తల్లి నాగలక్ష్మిని గట్టిగా నిలదీశాడు. అయినా ఫలితం లేకపోవడంతో తన తండ్రి మృతి పై అనుమానం ఉందని పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు తమదైన శైలిలో నాగలక్ష్మి విచారిస్తే విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. తమ అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని నాగలక్ష్మి మరియు మహేష్ ఇద్దరం కలిసే టవల్ తో హరిచరణ్ మెడకు ఉరిబిగించి బాత్రూంలో మూర్ఛ వ్యాధితో చనిపోయాడని నమ్మించామని పోలీసుల ముందు ఒప్పుకోవడంతో పోలీసులు మంగళవారం వారిద్దరిని అరెస్టు చేసి మీడియా ముందు ఉంచారు. ఇలాంటి ఘాతుకానికి పాల్పడ్డ ఇరువురిని కోర్టు ముందు హాజరు పరిచి రిమాండ్ కు తరలిస్తున్నట్లు ఏ.ఎస్.పి రాజేష్ మీనా మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ కేసులో ముఖ్యపాత్ర పోషించిన సోన్ సిఐ, ఎస్.ఐ గోపి లను అభినందించారు.