శ్రీకాకుళంలో న్యూరోసర్జన్ అత్యవసరం : ఎమ్మెల్యే గొండు శంకర్
శ్రీకాకుళం జిల్లాలో న్యూరోసర్జన్ అత్యవసరమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. నగరంలోని డే అండ్ నైట్ జంక్షన్ వద్ద సింధూర ఆసుపత్రిలో న్యూరో ఔట్ పేషెంట్ డిపార్టుమెంట్ను ఆయన ఆదివారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ —న్యూరోసర్జరీ విద్య చాలా క్లిష్టమైనదని, అందువల్ల న్యూరోసర్జన్లు ఎక్కువగా మెట్రో నగరాల ఆసుపత్రుల్లోనే పనిచేయాలని ఇష్టపడతారని తెలిపారు.శ్రీకాకుళం లాంటి జిల్లాలో న్యూరోసర్జన్లు తక్కువగా ఉండటంతో రోడ్డు ప్రమాదాల సమయంలో గోల్డెన్ అవర్లో తక్షణ వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.తలకు తగిలే గాయాలకు న్యూరో వైద్యం కీలకమని, విశాఖపట్నం తరలించేలోపు చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు.వైద్యం ఒక పవిత్ర వృత్తి అని, “వైద్యో నారాయణో హరి” అన్నట్లు వైద్యులు దేవుడి సదృశులని ఆయన పేర్కొన్నారు. శ్రీకాకుళం వంటి ప్రాంతంలో ఆధునిక సౌకర్యాలతో న్యూరో ఓపీని ఏర్పాటు చేసిన సింధూర ఆసుపత్రి యాజమాన్యానికి ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ సింధూర, న్యూరో నిపుణుడు డాక్టర్ అమర్ కార్తీక్, రాజకీయ నాయకులు ఉంగటి రమణ, అంబటి రాజ్యలక్ష్మీ, జామి భీమశంకర్, లయన్స్క్లబ్ ప్రతినిధులు నటుకుల మోహన్, బాడాన దేవభూషణరావు, బీజేపీ నాయకులు పాకతోట సింహాచలం, జెసీఐ అధ్యక్షుడు జామి భీమశంకర్, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

