భారతదేశ సామాజిక విప్లవ పితామహుడు, అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావ్ ఫూలే 200వ జయంతి వేడుకలను తూర్పుగోదావరి జిల్లా బహుజన్ సమాజ్ పార్టీ (BSP) శనివారం ఘనంగా నిర్వహించింది.
ఈ సందర్భంగా BSP జిల్లా అధ్యక్షులు పట్నాల విజయ్ కుమార్ మహాత్మా జ్యోతిరావ్ ఫూలే కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పిస్తూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ ఫూలే ఆశయాలను స్మరించుకున్నారు.
అణగారిన వర్గాలు మరియు మహిళల విద్యా హక్కు కోసం ఫూలే చేసిన పోరాటం మరువలేనిదని కొనియాడారు. కుల వివక్ష లేని సమాజ స్థాపన కోసం ఆయన వేసిన పునాదులే నేటి బహుజన ఉద్యమాలకు స్ఫూర్తి అని పేర్కొన్నారు.
ఫూలే ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని, బహుజనుల రాజ్యాధికారం కోసం ఐక్యంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో BSP రాజమండ్రి సిటీ ఇన్చార్జి ఇసకపట్ల రాంబాబు, జిల్లా నాయకులు నక్క వెంకటరత్నం, రాజమండ్రి రూరల్ నాయకులు క్రొత్తపల్లి శేఖర్, అర్బన్ నాయకులు కొంకి రమేష్ , ఐటీఐ భాస్కర్ తదితర నాయకులు పాల్గొన్నారు.


