రాజన్న సిరిసిల్ల జిల్లా /మార్చి /పున్నమి ప్రతినిధి
అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వం తాము ఇచ్చింది కేవలం 16,978 ప్రభుత్వ ఉద్యోగాలేనని ఒప్పుకుందని, మిగతా ఉద్యోగాలు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఇచ్చినవేనని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మెంగని మనోహర్ పేర్కొన్నారు. ప్రభుత్వం 2 ఏళ్లలో 67 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆయన విమర్శించారు. ఎన్నికల సమయంలో మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్, గెలిచిన తర్వాత జాబ్ క్యాలెండర్ పేరుతో కాలయాపన చేసి ఒక్క కొత్త నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదన్నారు.
నోటిఫికేషన్లు ఇస్తే అశోక్ నగర్, దిల్సుఖ్నగర్, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిరుద్యోగులు, విద్యార్థులు ఎందుకు ధర్నాలు చేస్తున్నారో కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించాలన్నారు. నిరుద్యోగ యువతను, విద్యార్థులను మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని విమర్శించారు. తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసం బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ ప్రజల మధ్యే ఉంటుందని, తెలంగాణకు కే .చంద్రశేఖర రావు గారి నాయకత్వమే అవసరమని ఆయన పేర్కొన్నారు.


