దేశవ్యాప్తంగా 5 నుండి 17 ఏళ్ల మధ్య వయస్సు గల పిల్లలకు ఏడాదిపాటు ఉచితంగా ఆధార్ అప్డేషన్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఈ సౌకర్యాన్ని ప్రకటించింది. పిల్లల బయోమెట్రిక్ వివరాలు, ఫోటో, చిరునామా, మొబైల్ నంబర్ లేదా ఇతర వివరాల్లో మార్పులు అవసరమైనప్పుడు తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఈ సేవను వినియోగించుకోవచ్చు. ఈ సదుపాయం కింద ఎటువంటి ఫీజులు లేదా సేవా ఛార్జీలు వసూలు చేయరు.
పిల్లల పెరుగుదల దశలో వారి బయోమెట్రిక్ వివరాలు తరచుగా మారుతుండటంతో, ఆధార్ వివరాలు సరిగ్గా ఉండేలా ఈ ఉచిత సదుపాయాన్ని UIDAI అందిస్తోంది. తల్లిదండ్రులు సమీపంలోని ఆధార్ నమోదు లేదా అప్డేషన్ కేంద్రానికి వెళ్లి అవసరమైన పత్రాలతో ఈ సేవను పొందవచ్చు. అలాగే “మై ఆధార్ పోర్టల్” ద్వారా కూడా కొన్ని వివరాలను ఆన్లైన్లో అప్డేట్ చేసుకోవచ్చు.
ఆధార్ సరిగా ఉండడం వల్ల పిల్లలకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు, స్కాలర్షిప్లు, బ్యాంక్ సేవలు, పాఠశాల ప్రవేశాలు వంటి కార్యక్రమాల్లో ఎటువంటి ఇబ్బందులు ఎదురవ్వవు. ఆధార్లో తప్పులు లేకుండా, తాజా వివరాలతో ఉంచడం ముఖ్యమని UIDAI సూచించింది. తల్లిదండ్రులు పిల్లల వివరాలను ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి సరిచూసుకోవడం ఉత్తమమని అధికారులు తెలిపారు. ఈ నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా లక్షలాది మంది పిల్లలు లబ్ధి పొందనున్నారు


