విశాఖపట్నం, అక్టోబర్ (పున్నమి ప్రతినిధి)
ఔషధ నియంత్రణ పరిపాలన డైరెక్టర్ జనరల్ గిరీష ఐఏఎస్ గారి ఆదేశాల మేరకు, డ్రగ్స్ కంట్రోల్ విభాగం, విశాఖపట్నం అసిస్టెంట్ డైరెక్టర్ ఎస్. విజయ్కుమార్ పర్యవేక్షణలో భారీ సోదాలు నిర్వహించారు.
ఈ క్రమంలో నాలుగు సంవత్సరాల లోపు పిల్లలకు వాడకాన్ని భారత ప్రభుత్వం నిషేధించిన సుమారు రూ.4.5 లక్షల విలువైన 5900 “Rivicold” కోల్డ్/కఫ్ సిరప్స్ ను విశాఖపట్నం మర్రిపాలెం ప్రాంతంలోని కిర్బి లైఫ్ సైన్సెస్ మెడికల్ ఏజెన్సీ వద్ద డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఎం. శ్రీనివాస్రావు స్వాధీనం చేసుకున్నారు.
ఈ సిరప్స్లో క్లోర్ఫెనిరమైన్ మాలియేట్ + ఫెనైలెఫ్రిన్ హైడ్రోక్లోరైడ్ మిశ్రమం ఉండగా, ఇవి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని బజాజ్ ఫార్ములేషన్స్, భగవాన్పూర్, రూర్కీ, హరిద్వార్ వద్ద తయారైనవి. సిరప్ లేబుల్పై తప్పనిసరిగా ఉండవలసిన “నాలుగు సంవత్సరాల లోపు పిల్లలకు వాడరాదు” అనే హెచ్చరిక ముద్రించకపోవడంతో చట్ట ఉల్లంఘనగా గుర్తించారు.
దీని వలన చిన్నారుల ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పు ఏర్పడే అవకాశముందని, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం సెక్షన్ 26A ప్రకారం తయారీదారుడిపై కేసు నమోదు చేయబడింది. స్వాధీనం చేసుకున్న సిరప్స్ను తదుపరి చర్యల కోసం గౌరవ న్యాయస్థానానికి అప్పగించనున్నట్లు డ్రగ్స్ ఇన్స్పెక్టర్ తెలిపారు.
ఇటీవల మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కలుషిత కఫ్ సిరప్స్ వలన చిన్నారుల మరణాలు సంభవించిన నేపథ్యంలో, డ్రగ్స్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్రావు “వైద్యుని ప్రిస్క్రిప్షన్ లేకుండా కోల్డ్/కఫ్ సిరప్స్ ఇవ్వరాదు” అని హెచ్చరించారు.
నిషేధిత మిశ్రమాలు విక్రయించినట్లయితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోబడతాయని తెలిపారు.
ఈ సోదాలో డ్రగ్స్ ఇన్స్పెక్టర్ సిబ్బంది, పోలీసులు పాల్గొన్నారు.


