30వ సిఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్- 2025 కు విస్తృత ఏర్పాట్లు…
*విశాఖపట్నం,నవంబర్ పున్నమి ప్రతినిధి:-*: విశాఖపట్నంలో ఈనెల 14,15 తేదీల్లో రెండు రోజులపాటు జరుగనున్న 30వ సిఐఐ(భారత పరిశ్రమల సమాఖ్య)(Confederation of Indian Industries)భాగస్వామ్య సదస్సు(Partnership Summit)2025 నిర్వహణకు విస్తృతమైన ఏర్పాట్లు పూర్తయ్యాయి.భారతప్రభుత్వంమరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం,సిఐఐ భాగస్వామ్యం తో సాగరతీర నగరమైన విశాఖపట్నం ఆంధ్ర విశ్వ కళా పరిషత్ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో సిఐఐ సమ్మిట్ జరగనుంది.ఇందుకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.రెండు రోజులపాటు జరిగే ఈసదస్సుకు ఆంధ్రప్రదేశ్ పెవీలియన్ ప్లీనరీ హాల్ ప్రధాన వేదికగా ఉండగా దానికి అనుబంధంగా వివిధ హాళ్ళను ఏర్పాటు చేశారు.అక్కడ వివిధ ప్లినరీ సెషన్లు జరగనున్నాయి.
రెండు రోజుల సిఐఐ సమ్మిట్లో భాగంగా 14వ తేది శుక్రవారం ఉ.8.30 గం.ల నుండి ఈ.10.30 గం.ల వరకు ఆంధ్రప్రదేశ్ పెవీలియన్ ప్లీనరీ హాల్ 5 లో ప్రారంభోత్సవ కార్యక్రమం (Inaugural Session) జరగనుంది.ఈకార్యక్రమంలో భారత ఉప రాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిధిగా పాల్గోనుండగా రాష్ట్ర గవర్నర్ జస్టీస్ సయ్యద్ అబ్దుల్ నజీర్ గౌరవ అతిథిగా పాల్గోనున్నారు. అదే విధంగా కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖామాత్యులు పియూష్ గోయల్,రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులు కీలకోపాన్యాసం చేయనున్నారు. ఇంకా ఈప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు,పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్, నాదెండ్ల మనోహర్,టిజి భరత్,సిఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జి, పలువురు పరిశ్రమల ప్రతినిధులు,రాష్ట్ర మంత్రులు తదితరులు పొల్గోనున్నారు.
అనంతరం 10.30 గం.ల నుండి 11.45 గం.ల వరకు ఓపెనింగ్ ప్లినరీ కార్యక్రమం జరుగుతుంది. గౌరవ అతిధులుగా కేంద్రమంత్రి పియుష్ గోయల్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొంటారు.అలాగే పలువురు పరిశ్రమల ప్రతినిధులు పాల్గొంటారు.అదే సమయంలో వివిధ కాన్పరెన్స్ హాల్లో వివిధ ప్లీనరీ సెషన్లు జరగనున్నాయి. సా.8 గం.ల వరకు జరగనున్నాయి.
రెండవ రోజు కార్యక్రమంలో భాగంగా 15వతేది ఉదయం 9.30 గం.ల నుండి సాయంత్రం వరకూ వివిధ ప్లీనరీ హాల్లో పలు ప్లీనరీ సెషన్లు జరగనున్నాయి. అనంతరం సాయంత్రం 5 గం.ల నుండి 5.45.గంల వరకు ఈ రెండు రోజుల సిఐఐ భాగస్వామ్య సదస్సు ముగింపు వేడుక (Valedictory Session) ప్రధాన వేదికైన ఆంధ్రప్రదేశ్ పెవీలియన్ ప్లీనరీ హాల్ 5లో జరగనుంది.ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పియూష్ గోయల్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గౌరవ అతిథులుగా పాల్గోనున్నారు.అదే విధంగా సిఐఐ ఉపాధ్యక్షులు సుచిత్రా కె.యల్ల,సిఐఐ ఇంటర్నేషనల్ కౌన్సిల్ చైర్మన్ ఆర్.దినేష్ తదితరులు పొల్గోనున్నారు. అనంతరం సా.5.45 గం.లకు ఈరెండు రోజుల సదస్సు ముగియనుంది.
కాగా రెండు రోజుల సిఐఐ భాగస్వామ్య సదస్సుకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రధాన వేదికైన ఆంధ్రప్రదేశ్ పెవీలియన్ లో సభావేదికతో పాటు ముఖ్య అతిథులు,ఇతర అతిథులు,మీడియా తదితరులు కుదుర్చుకునేందుకు వీలుగా తగిన ఏర్పాట్లు చేశారు.అలాగే మిగతా ప్లినరీ హాల్స్ వద్ద కూడా తగిన ఏర్పాట్లు చేశారు.అదే విధంగా సభావేదికకు వెలుపల ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో వివిధ వాహనాల పార్కింగ్ కు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు.
రెండు రోజుల సిఐఐ భాగస్వామ్య సదస్సు సందర్భంగా ఎపి బ్రాండ్ ఇమేజ్ ను ప్రపంచానికి చాటి చెప్పే ప్రక్రియలో భాగంగా దేశ రాజధాని ఢిల్లీ సహా ముంబాయి హైదరాబాద్,చెన్నై,బెంగుళూరు, విశాఖపట్నం,విజయవాడ నగరాల్లోని ప్రధాన కూడళ్లు, విమానాశ్రయాల్లో పలు హోర్డింగులు,డిజిటల్ డిస్ప్లేచేయడం జరిగింది. అలాగే రాష్ట్రంలోని ఇతర ముఖ్య నగరాలు,పట్టణాల్లో కూడా పెద్ద ఎత్తున హోర్డింగులు ఏర్పాటు చేయడం జరిగింది.ముఖ్యంగా విశాఖ నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. నగరమంతా సిఐఐ సదస్సుకు సంబంధించి పెద్ద ఎత్తున హోర్డింగులు ఏర్పాటు చేయడం జరిగింది.పారిశ్రామిక వేత్తలను ఆకట్టుకునే రీతిలో ఎపి బ్రాండింగ్ జరిగింది.అంతేగాక వివిధ ప్రసార మాధ్యమాలు ద్వారా సిఐఐ సమ్మిట్ పై విస్తృతమైన ప్రచారం చేయడం జరిగింది.
సిఐఐ సమ్మిట్లో పెద్ద ఎత్తున అవగాహనా ఒప్పందాలు (MOU)..
విశాఖపట్నంలో జరుగుతున్న సిఐఐ సమ్మిట్లో వివిధ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం పలు అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకోనుంది.
ఇప్పటికే 13వ తేదీన పరిశ్రమల శాఖ 9 ఎంఓయులు,ఐఅండ్ఐ 3, ఆహారశుద్ధి శాఖ 4,ఇంధన శాఖ 6,సిఆర్డిఏ 8 ఎంఓయులు కుదుర్చుకోవడం జరిగింది.
కాగా 14వ తేది తొలిరోజు సదస్సులో సాయంత్రం 6.30 గం.ల నుండి రాత్రి 7.30. గం.ల మధ్య ప్రధాన వేదిక ప్రాంగణంలో హాల్ నంబరు 7లో పరిశ్రమల శాఖ 14, ఐఅండ్ ఐ 15,ఆహార శుద్ధి శాఖ 6,ఇంధన శాఖ 21 అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకోనుంది.
అదే విధంగా చివరి రోజైన 15వ తేది మధ్యాహ్నం 2.30.గం.ల నుండి 3.30 గం.ల మధ్య ప్రధాన వేదిక ప్రాంగణం హాల్ నంబరు 7లో పరిశ్రమల శాఖ 27 ఎంఓయులను,పర్యాటక శాఖ 21,ఐటి శాఖ 7,చేనేత జౌళి శాఖ రెండు అవగాహనా ఒప్పందాలను కుదుర్చుకోనుంది.అదే విధంగా ఈరెండు రోజుల్లోను మిగతా హాల్లో కూడా వివిధ సంస్థలతో పలుశాఖలు అవగాహనా ఒప్పందాలను కుదుర్చుకోనున్నాయి.


