
శ్రీకాకుళం: రక్షాబంధన్ పర్వదినం సోదర–సోదరీల మధ్య ప్రేమ, అనుబంధానికి ప్రతీక. ఈ బంధానికి ఆదర్శంగా నిలిచే సంఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. నరసన్నపేట మండలం బడ్డవానిపేటకు చెందిన తిరుపతమ్మ, తన తమ్ముడు వజ్జ ప్రసాదరావుకు కిడ్నీలు పనిచేయకపోవడంతో, తన కిడ్నీలో ఒకదానిని దానం చేసింది.2011లో ప్రసాదరావు కిడ్నీలు దెబ్బతిన్నాయని వైద్యులు నిర్ధారించారు. కుటుంబ సభ్యులెవరైనా కిడ్నీ దానం చేస్తేనే ఆయన ప్రాణాలు కాపాడవచ్చని డాక్టర్లు సూచించగా, తిరుపతమ్మ ముందుకు వచ్చి దానం చేసింది. ఆపరేషన్ విజయవంతం కావడంతో ప్రస్తుతం ప్రసాదరావు భార్యా పిల్లలతో సుఖంగా జీవిస్తున్నాడు. ఈ సంఘటన రక్షాబంధన్ స్ఫూర్తిని ప్రతిబింబించే ఉదాహరణగా నిలిచింది.

