చిట్వేలు, సెప్టెంబర్ 29(పున్నమి ప్రతినిధి)
“వృక్షో రక్షతి రక్షితః, పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు” అనే భావంతో, కేవలం నినాదాలకే పరిమితం కాకుండా ప్రాక్టికల్గా సేవా కార్యక్రమాలు చేసి చూపించాలని ముందడుగు వేసిన చిట్వేలి గ్రామానికి చెందిన పర్యావరణాభిమానులు ఆదర్శంగా నిలిచారు.సోమవారం చిట్వేలి హిందూ ధర్మ స్మశాన వాటిక వద్ద స్వచ్ఛంద సేవకులు నూతి సత్యం, గాడి ఇంతియాజ్ అహ్మద్ కలిసి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త గాడి ఇంతియాజ్ అహ్మద్ మాట్లాడుతూ – “చాలా కాలంగా స్మశాన వాటికలో టెంకాయ, రావి, కానుగ, వేప, గన్నేరు, నందివర్ధనం, మందారం వంటి పూల చెట్లు నాటాలనే ఆలోచన ఉండేది. అంత్యక్రియల సమయంలో టెంకాయ మట్టలు, పూలు అందరికీ ఉపయోగపడతాయి. ఇప్పుడు వర్షాలు పడుతుండటం వల్ల ఇది సరైన సమయం అని భావించి ఈరోజు కార్యక్రమం చేపట్టాం” అని తెలిపారు.ఈ కార్యక్రమానికి నూతి సత్యం చొరవ చూపినందుకు చిట్వేల్ హెల్ప్ లైన్ సొసైటీ సంస్థ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.అలాగే, ఐదు సంవత్సరాల క్రితం అంబేద్కర్ సర్కిల్ నుండి ప్రధాన రహదారి వెంబడి, పురవీధులలో సి.హెచ్.ఎస్. సంస్థ ఆధ్వర్యంలో నాటిన మొక్కలు నేడు మహావృక్షాలుగా పెరిగి చల్లటి నీడనిస్తున్న ఉదాహరణను గుర్తు చేశారు.ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ – “ప్రస్తుతం వర్షాకాలం, మొక్కలు నాటడానికి అద్భుతమైన సమయం. యువత ముందుకు వచ్చి ఇలాంటి పర్యావరణ సేవా కార్యక్రమాలు చేపట్టాలి. పచ్చని భవిష్యత్తు కోసం మా సంస్థ తరఫున ఎల్లప్పుడూ సహకారం అందిస్తాం” అని హామీ ఇచ్చారు.


