దేశ సమైక్యత, ఐక్యత, సమగ్రతకు ప్రతీకగా నిలిచిన ఉక్కు మనిషి, స్వాతంత్య్ర సమరయోధుడు, దేశ నిర్మాణ శిల్పి, భారతదేశ తొలి ఉప ప్రధానమంత్రి హోం మంత్రి స్వర్గీయ శ్రీ సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా, విశాఖపట్నం రేంజ్ పోలీసు కార్యాలయంలో “జాతీయ సమైక్యతా దినోత్సవం (రాష్ట్రీయ ఏక్తా దివస్)” ను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా డీఐజీ గోపినాథ్ జట్టి, ఐపీఎస్ పటేల్ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు
తదనంతరం ఆయన మాట్లాడుతూ —
భారత స్వాతంత్య్రానంతరం దేశంలోని అనేక రాచరిక రాష్ట్రాలను భారత యూనియన్లో విలీనం చేయడంలో సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ గారు పోషించిన అత్యంత కీలక పాత్ర దేశ చరిత్రలో చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన చూపిన దారిలోనే మనం దేశ సమైక్యత, సమగ్రత, భద్రతను కాపాడటానికి అంకితభావంతో సేవ చేయాలని పోలీసు సిబ్బందిని పిలుపునిచ్చారు.
తరువాత పోలీసు సిబ్బందితో కలిసి దేశ ఐకమత్యం, సమగ్రత, అంతర్గత భద్రతను కాపాడేందుకు అంకితమవుతామనే ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. దేశ ప్రజలలో సమైక్యతా భావాన్ని మరింతగా పెంపొందించేందుకు కృషి చేస్తామని డీఐజీ తెలిపారు.
ఈ కార్యక్రమంలో కార్యాలయం మేనేజర్ బాల సూర్యారావు, ఇతర అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.


