దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్

విశాఖపట్నం:
నగరంలో తొలగించిన స్ట్రీట్ వెండర్స్, ఫుడ్ కోర్ట్ వర్తకుల వ్యాపారాలను తిరిగి ఏర్పాటు చేస్తామని జనసేన పార్టీ నగర అధ్యక్షులు, దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ హామీ ఇచ్చారు.
అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే ఆపరేషన్ లంగ్స్-2.0 ద్వారా వీధి వ్యాపారస్తుల సమస్యలను పరిష్కరిస్తానని ఆయన తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు ఎదురవకుండా వెండర్ కార్డులు జారీ చేసి, వ్యాపారాలను చట్టబద్ధంగా కొనసాగించేలా చర్యలు తీసుకుంటానని భరోసా ఇచ్చారు.
చిరు వర్తకులకు వ్యతిరేకం కాని కూటమి ప్రభుత్వం, స్ట్రీట్ వెండర్స్ యాక్ట్-2014 ప్రకారం వ్యాపారాలకు రక్షణ కల్పిస్తుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఏళ్ల తరబడి చిన్న వ్యాపారాలతో జీవనం సాగిస్తున్న పేదల బ్రతుకులు రోడ్డున పడకుండా కాపాడే బాధ్యత తనదేనని ఆయన ప్రకటించారు.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేసిన ఆయన, ప్రతిపక్షం చేస్తున్న విమర్శలు అసత్య ప్రచారమేనని కొట్టిపారేశారు. “వీధి వ్యాపారస్తులు ఎలాంటి సందేహం లేకుండా ధైర్యంగా ఉండాలి. అసెంబ్లీ సమావేశాలు ముగియగానే వెండర్ కార్డులు పంపిణీ చేసి వ్యాపారాలను యధావిధిగా కొనసాగించేలా చర్యలు తీసుకుంటాం” అని వంశీకృష్ణ శ్రీనివాస్ భరోసా ఇచ్చారు.

