విశాఖ గాజువాక (పున్నమి ప్రతినిధి):
విశాఖ స్టీల్ ప్లాంట్లో వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్(VRS)కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడంతో VRS దరఖాస్తుల గడువును ఈ నెల 27వ తేదీ వరకు పొడిగిస్తూ ప్లాంట్ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాది డిసెంబర్ 24న విడుదల చేసిన సర్క్యులర్ ప్రకారం ఈ నెల 20వ తేదీ లోపు ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా, స్పందన తక్కువగా ఉండటంతో గడువు పెంచినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు సుమారు 500 మంది ఉద్యోగులు మాత్రమే VRSకు దరఖాస్తు చేసినట్లు సమాచారం. స్టీల్ ప్లాంట్ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకునే ఉద్దేశంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలుస్తుండగా, ఉద్యోగ భద్రతపై ఆందోళనలు, భవిష్యత్పై స్పష్టత లేకపోవడం వల్ల ఉద్యోగులు ముందుకు రావడం లేదని యూనియన్లు పేర్కొంటున్నాయి. గడువు పొడిగింపుతో అయినా మరింత మంది ఉద్యోగులు స్పందిస్తారా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది.



