*స్క్రబ్ టైఫస్పై అధ్యయనానికి వైద్యనిపుణులతో టాస్క్ఫోర్స్*
*ప్రభుత్వ చర్యలతో 48 శాతం తగ్గిన అంటువ్యాధులు*
*డెంగ్యూ 56 శాతం, మలేరియా 11 శాతం, చికున్ గున్యా 46 శాతం తగ్గుదల*
*సీజనల్ వ్యాధులను పూర్తిగా కట్టడి చేయాలి*
*అపరిశుభ్రతే అసలు జబ్బు…ప్రజల్లో చైతన్యం పెంచాలి*
*వైద్య ఆరోగ్య శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు*
*అమరావతి డిసెంబర్ 10 పున్నమి ప్రతినిధి:-* స్క్రబ్ టైఫస్పై అధ్యయనం చేసేందుకు, భవిష్యత్లో దీన్ని పూర్తిగా నివారించేందుకు జాతీయ స్థాయి వైద్య నిపుణులతో ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదేశించారు. సచివాలయంలో వైద్యారోగ్య శాఖపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ తీవ్రత, దాని బారిన పడినవారికి అందుతోన్న వైద్య సాయంపై సమీక్ష చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,592 మంది స్క్రబ్ టైఫస్ బారిన పడ్డారని సీఎంకు అధికారులు వివరించారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 420 కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ వ్యాధి కారణంగానే ప్రాణాలు పోతున్నట్లు ఇప్పటి వరకు నిర్థారణ కాలేదని చెప్పారు. చనిపోయిన 9 కేసుల్లోనూ కాజ్ ఆఫ్ డెత్పై పరిశీలన జరిపామని… స్క్రబ్ టైఫస్ వల్లనే చనిపోయారని ఎక్కడా నిర్థారణ కాలేదని అధికారులు వివరించారు. ఇతర ఆరోగ్య సమస్యలు, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా ఆ 9 మంది చనిపోయినట్లు అధికారులు సీఎంకు తెలియజేశారు. ప్రజలు స్క్రబ్ టైఫస్ భారిన పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నామని…వ్యాధి ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య బృందాలతో పరీక్షలు నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో స్క్రబ్ టైఫస్ ప్రభావం ఉందని… ఈ వ్యాధికి సంబంధించిన కేసుల్లో ఏపీ 8వ స్థానంలో ఉందని తెలిపారు. తమిళనాడు, ఒడిస్సాలలో 7 వేలు చొప్పున కేసులు ఉన్నాయని వివరించారు. దీనిపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ…..స్క్రబ్ టైఫస్ను నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. ఇదే సమయంలో జాతీయ, అంతర్జాతీయ నిపుణులతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ టాస్క్ ఫోర్స్ క్షేత్రస్థాయిలో పర్యటన ద్వారా ఇచ్చే నివేదికను అమలు చేయడంతో వ్యాధిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
*48 శాతం తగ్గిన సీజనల్ వ్యాధులు*
రాష్ట్రంలో సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకుంటున్న చర్యలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా గత ఏడాది కాలంగా తీసుకున్న ముందస్తు చర్యలతో సీజనల్ వ్యాధులు 48 శాతం మేర తగ్గినట్లు తెలిపారు. 2024 సంవత్సరంలో 5,555 డెంగ్యూ కేసులు రాగా….ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 2,452 కేసులు మాత్రమే వచ్చాయన్నారు. ఈ మేరకు డెంగ్యూ కేసులు 56 శాతం తగ్గాయని తెలిపారు. గత ఏడాది 7,871 మంది మలేరియా బారినపడగా…..ఈ ఏడాది 7,010కి మలేరియా సోకిందన్నారు. మలేరియా కేసుల్లో 11 శాతం తగ్గుదల కనిపించదని వివరించారు. చికున్ గున్యా గత ఏడాది 266 కేసులు రాగా…ఈ ఏడాది 142 వచ్చాయని, చికున్ గున్యా కేసులు 46.5 శాతం తగ్గినట్లు అధికారులు వివరించారు. జపనీస్ ఎన్సెఫాలిటిస్ (JE) కేసులు 11 నుంచి 2కు తగ్గినట్లు తెలిపారు. పరిశుభ్రత పెంపు, సీజనల్ వ్యాధులపై నిరంతర ప్రచారం, విస్తృత స్థాయిలో పరీక్షలు నిర్వహించడం, ముందు జాగ్రత్తలు కారణంగా సీజనల్ వ్యాధులు 48 శాతం మేరకు తగ్గినట్లు అధికారులు సీఎంకు వివరించారు.
*అపరిశుభ్రతే అసలు జబ్బు….ప్రజల్లో చైతన్యం పెంచాలి*
అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ….అన్ని శాఖల సమన్వయంతో సీజనల్ వ్యాధులను సున్నా స్థాయికి తీసుకురావాలన్నారు. అంతా కలిసి పనిచేస్తే ఈ లక్ష్యాన్ని చేరుకోవచ్చని సీఎం తెలిపారు. సమాజంలో అతిపెద్ద జబ్బు అపరిశుభ్రతే అని….దీన్ని మార్చగలిగితే అనేక వ్యాధులను దూరం చేయవచ్చని సీఎం అన్నారు. అనేక వ్యాధులకు కారణమైన అపరిశుభ్రతను దూరం చేయాలని, ప్రజల్లో నిరంతరం చైతన్యం నింపాలన్నారు. మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి వ్యాధుల నివారణకు మరింత పకడ్బందీగా చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. సమీక్షలో వైద్యారోగ్య శాఖ సెక్రటరీ సౌరబ్ గౌర్, వైద్యారోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండ్యన్, ఎన్టీఆర్ వైద్యసేవ సీఈవో దినేష్ కుమార్, ఏపీఎంఎస్ఐడీసీ ఛైర్మన్ గిరీశా పాల్గొన్నారు.


