రాజన్న సిరిసిల్ల జిల్లా /పున్నమి ప్రతినిధి /ఫిబ్రవరి
బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 2026 ఫిబ్రవరి 6, 7, 8 తేదీలలో రాజస్థాన్ రాష్ట్రంలోని శ్రీకర్లో జరగనున్న జాతీయ మహాసభలకు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు ఫిబ్రవరి 4వ తేదీ రాత్రి బయలుదేరారు.
ఈ మహాసభల్లో దేశవ్యాప్తంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, కార్మిక హక్కుల పరిరక్షణ, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలపై సమగ్రంగా చర్చించి భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ రూపొందించనున్నట్లు యూనియన్ నాయకులు తెలిపారు.
ఈ జాతీయ మహాసభలకు రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి డెలిగేట్గా జిల్లా బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు, రాష్ట్ర కమిటీ సభ్యుడు గీస బిక్షపతి పాల్గొనే అవకాశాన్ని పొందారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ:
“దేశవ్యాప్తంగా కార్మిక వర్గం తీవ్రమైన అన్యాయాలకు గురవుతోంది. కార్మిక చట్టాల నిర్వీర్యం, సంక్షేమ పథకాల కోతలు, అసంఘటిత కార్మికుల నిర్లక్ష్యం వంటి సమస్యలపై ఈ జాతీయ మహాసభల్లో బలమైన కార్యాచరణ రూపొందిస్తాం. రాజన్న సిరిసిల్ల జిల్లా కార్మికుల సమస్యలను జాతీయ వేదికపై వినిపించేందుకు ఈ అవకాశం ఉపయోగపడుతుంది” అని తెలిపారు.
ఈ మహాసభల్లో రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శితో పాటు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారని, కార్మిక–కర్షక ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ సమావేశాలు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు.

