విశాఖ గాజువాక ఫిబ్రవరి (పున్నమి ప్రతినిధి)
విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ప్లాంట్ యాజమాన్యం తాజాగా 146 మంది ఉద్యోగులకు హెచ్చరిక నోటీసులు జారీ చేసింది.ఈ నెల 12న నిర్వహించిన సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులను గుర్తించి వారికి నోటీసులు పంపినట్లు సమాచారం.ప్రస్తుత పరిస్థితుల్లో సంస్థ ఆర్థిక స్థితి,ఉత్పత్తి లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని ఉద్యోగులు,కార్మికులు సంస్థ అభివృద్ధికి సహకరించాలని,సమ్మెలు మరియు నిరసన కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సీఎండీ ఆదేశాలను నోటీసుల్లో పేర్కొన్నట్లు తెలిసింది.విధి నిర్వహణలో అంతరాయం కలిగించే చర్యలు పునరావృతమైతే క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించినట్లు సమాచారం.ఈ నోటీసులు సాధారణ షోకాజ్ కంటే కఠినంగా ఉన్నాయని ఉద్యోగ సంఘాలు వ్యాఖ్యానిస్తున్నాయి.సమ్మె హక్కు కార్మికుల ప్రాథమిక హక్కు అని,హెచ్చరికలతో ఒత్తిడి తేవడం సరైంది కాదని కార్మిక వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.యాజమాన్యం-ఉద్యోగ సంఘాల మధ్య చర్చలు జరిగే అవకాశముందని తెలిసింది.



