విశాఖపట్నం, జనవరి (పున్నమి ప్రతినిధి):
సంక్రాంతి పండుగ అనగానే సంస్కృతి, సంప్రదాయం, కుటుంబ ఆనందం గుర్తుకు రావాలి. కానీ విశాఖపట్నం నగర శివార్లలో, గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ప్రతి ఏటా ఈ పండుగ పేరు చెప్పుకుని నిషేధిత కోళ్ల పందాలు మళ్లీ రెచ్చిపోతున్నాయి. పోలీసు నిషేధాలు, కోర్టు ఆదేశాలు కాగితాలకే పరిమితమవుతున్నాయా అన్న అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. లక్షల నుంచి కోట్ల వరకు బెట్టింగ్లు సాగుతున్న ఈ కోళ్ల పందాల వెనుక వ్యవస్థీకృత జూద మాఫియా పని చేస్తోంది. ముందస్తు ఏర్పాట్లు, ప్రత్యేక బ్లేడ్ కోళ్లు, బయట ప్రాంతాల నుంచి తెచ్చిన పందెం నిర్వాహకులు… అన్నీ పండుగకు ముందే సిద్ధమవుతున్నాయి. కొన్నిచోట్ల రాజకీయ అండదండలున్నాయన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి. పందాల వల్ల యువత వ్యసనాలకు బానిసలవుతుండగా, కుటుంబాలు ఆర్థికంగా కుదేలవుతున్నాయి. రక్తపాతం, గొడవలు, హత్యల వరకూ వెళ్లిన సంఘటనలు గతంలో ఎన్నో ఉన్నప్పటికీ, పాలక యంత్రాంగం ప్రతి ఏటా అదే నిర్లక్ష్యాన్ని చూపుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంక్రాంతి పండుగ పేరుతో చట్ట విరుద్ధమైన కోళ్ల పందాలకు శాశ్వతంగా చెక్ పెట్టే చర్యలు ఎప్పుడు చేపడతారన్నదే విశాఖ ప్రజల ప్రశ్న. సంప్రదాయ పండుగను జూద పండుగగా మార్చే ప్రయత్నాలను ప్రభుత్వం అడ్డుకోకపోతే, భవిష్యత్తు తరాలకు మిగిలేది నాశనమేనని సామాజిక వేత్తలు హెచ్చరిస్తున్నారు.



