శ్రీసిటీ, నవంబర్ 06, 2025:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నే, తన భర్త, కేంద్ర ఎలక్ట్రానిక్స్ & ఐటీ మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి అజయ్ ప్రకాశ్ సాహ్నేతో కలిసి గురువారం శ్రీసిటీని సందర్శించారు. శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి ఆమెకు సాదర స్వాగతం పలికి, శ్రీసిటీ ప్రగతి, ప్రత్యేకతలను వివరించారు. పరిశ్రమల అభివృద్ధితో పాటు “మేక్ ఇన్ ఇండియా” కార్యక్రమానికి సహకారం, ఉపాధి సృష్టి మరియు ప్రాంతీయ ఆర్థిక అభివృద్ధిలో శ్రీసిటీ కీలక పాత్రను వివరించారు.
గతంలో అజయ్ సాహ్నే విలువైన సూచనలతో సాంకేతిక, తయారీ రంగాల్లో శ్రీసిటీకి నూతనోత్సాహం తెచ్చిందని డాక్టర్ సన్నారెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆమె చొరవతో ట్రిపుల్-శ్రీసిటీలో జ్ఞాన్ సర్కిల్ వెంచర్స్ స్థాపన, ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ (EMC) అభివృద్ధి శ్రీసిటీ ప్రగతిలో మైలురాళ్లుగా పేర్కొన్నారు.
శ్రీసిటీ పెట్టుబడుల అనుకూల వాతావరణం, ప్రపంచ స్థాయి మౌళిక సదుపాయాలను నీలం సాహ్నీ ప్రశంసించారు. అంతర్జాతీయ వ్యాపార కేంద్రంగా శ్రీసిటీ అభివృద్ధి చెందడం ఆనందంగా వుందన్న ఆమె, ఇందులో భాగస్వామ్యులైన వారందరికీ అభినందనలు తెలిపారు.
శ్రీసిటితో తన సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తుచేసుకున్న ప్రకాశ్ సాహ్నే, ఈ సందర్శన ఎంతో మధురానుభూతిని మిగిల్చిందన్నారు. శ్రీసిటీ ప్రగతి ప్రయాణం ఇతర పారిశ్రామికవేత్తలకు ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు.
ఈ పర్యటనలో భాగంగా అతిథులు శ్రీసిటీ పరిసరాలతో పాటు ఆల్స్టమ్, హంటర్ డగ్లస్ పరిశ్రమలను సందర్శించారు.


