ఈఎస్ఐ స్కామ్ లో అచ్చెన్నాయుడు అరెస్టుతో తెలుగుదేశం పార్టీలో వణుకు మొదలైంది. నిన్నమొన్నటి దాకా ఎక్కడో దాక్కున్న పచ్చ తమ్ముళ్ళంతా ఇప్పుడు అక్రమ అరెస్టులు చేస్తున్నారంటూ జగన్ సర్కారుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. అయితే ముందుంది ముసళ్ళ పండగ అంటూ వైసీపీ ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ పోతోంది. ఇటీవల క్యాబినెట్ మీటింగ్ లో ఏపీ ఫైబర్ నెట్ లో అక్రమాలు జరిగాయని, దీనిపై సీబీఐ విచారణ కోరాలని నిర్ణయించారు. అందులో అక్రమాలు జరిగాయని తేలితే నారా లోకేష్ కు ఉచ్చు బిగుసుకున్నట్లే. టీడీపీ హయాంలో ఐటీ మంత్రిగా పని చేసిన లోకేష్ ఆంధ్రా ప్రజలకు తక్కువ ధరకే బ్రాడ్ బ్యాండ్ ఇస్తామంటూ ఏపీ ఫైబర్ గ్రిడ్ ని తెరపైకి తెచ్చింది. ఇందులో నిజంగా స్కామ్ జరిగిందా లేదా అనే ప్రస్తుతానికి తెలియదు కానీ, ఒకవేళ ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశిస్తే, అందులో అక్రమాలు జరిగాయని తేలితే మాత్రం చినబాబు చిక్కుకున్నట్లే. సీబీఐ కనుక పూర్తిస్థాయిలో దీనిపై దృష్టి సారించి రంగంలోకి దిగితే.. ముందుగా అరెస్టయ్యేది వేమూరి హరిప్రసాద్. ఈఎస్ఐ స్కామ్ లో ఎలాగైతే రమేష్ కుమార్ ఏ-1 నిందితుడిగా మారారో.. హరి ప్రసాద్ ఏ-1 నిందితుడిగా చేరడం ఖాయం. గతంలో స్ట్రాంగ్ రూమ్ నుంచి ఈవీఎంను దొంగిలించిన ఘన చరిత్ర ఈ హరిప్రసాద్ కు ఉంది. ఇక ఏ-2 అచ్చెన్నాయుడు ఎలా అరెస్ట్ అయ్యారో… లోకేష్ కు అదే గతి పట్టే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికే ఈఎస్ఐ అవినీతి తుట్టె కదలడంతో టీడీపీలో కలవరం మొదలైంది. పైకి గాంభీర్యం ప్రదర్శిస్తున్నా తెలుగు తమ్ముళ్ళల్లో మాత్రం భయం ఆవహించి వుంది. అదీగాక నారా లోకేష్ ఇటీవల “నన్ను టార్గెట్ చేయడమే మీ లక్ష్యమైతే ఆల్ ది బెస్ట్” అంటూ ట్విట్టర్ లో ఛాలెంజ్ కూడా చేశారు. ఇప్పుడు కనక వైసీపీ సర్కార్ సీబీఐ విచారణకు ఆదేశిస్తే పరిణామాలు ఎలా వుండబోతాయనేది కూడా ఊహకు అందని విషయం. ప్రస్తుతానికి మాత్రం ఫైబర్ గ్రిడ్ పై సీబీఐ విచారణ చేయించాలని మాత్రమే నిర్ణయం తీసుకుంది. విచారణకు ఇంకా ఆదేశించలేదు. ఆదేశిస్తే మాత్రం లోకేష్ సీబీఐని ఫేస్ చేయకతప్పదు.