ఖమ్మం, మార్చి
(పున్నమి జిల్లా ఇంచార్జి):
పేదల పక్షాన భారతీయ జనతా పార్టీ చేపట్టిన నిరంతర పోరాటం ఫలించి, ఖమ్మం నగర పరిధిలోని వెలుగుమట్ల భూదాన్ బాధితులకు ఎట్టకేలకు న్యాయం జరిగినట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు తెలిపారు. ప్రభుత్వ చర్యలతో ఇళ్లు కోల్పోయి వీధినపడ్డ బాధితులకు అదే స్థలంలో ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం బీజేపీ పోరాట విజయమని ఆయన పేర్కొన్నారు.
వెలుగుమట్ల భూదాన్ భూముల్లో నివసిస్తున్న పేదల ఇళ్లను ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అర్ధరాత్రి వేళ భారీ పోలీసు బలగాల మధ్య కూల్చివేయడంతో వందలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. ఈ ఘటనపై బీజేపీ నాయకులు తీవ్రంగా స్పందించి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు అండగా నిలిచారు. ఇళ్లు కోల్పోయి ఖమ్మంలోని అంబేద్కర్ భవన్లో ఆశ్రయం పొందుతున్న కుటుంబాలకు ఆహార వసతి కల్పిస్తూ మానవత్వాన్ని చాటుకున్నారు.
ఈ సమస్యను రాష్ట్ర మరియు జాతీయ స్థాయికి తీసుకెళ్లిన బీజేపీ నాయకత్వం, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, ఎంపీ ఈటల రాజేందర్ తదితరులను వెలుగుమట్లకు తీసుకువచ్చి బాధితుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపింది. అదేవిధంగా జాతీయ ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిషన్లకు ఫిర్యాదు చేయడంతో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ స్వయంగా వచ్చి పరిస్థితులను పరిశీలించారు. అధికారుల వైఖరిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసి బాధితులకు న్యాయం చేయాలని సూచించారు.
బీజేపీ శ్రేణులు బాధితులతో కలిసి నిర్వహించిన ఆందోళనలు, ధర్నాలు ప్రభుత్వంలో చలనం తెచ్చాయి. దీంతో ఎట్టకేలకు ప్రభుత్వం దిగివచ్చి వెలుగుమట్లలో ఇళ్లు కూల్చిన చోటే ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం ప్రకారం మొత్తం 311 మంది నిరుపేదలకు 75 గజాల చొప్పున సుమారు ఐదు ఎకరాల భూమిని కేటాయించనున్నారు.
అయితే వెలుగుమట్లలో మొత్తం 62 ఎకరాల భూదాన్ భూమి ఉండగా, అందులో సుమారు 30 ఎకరాలు ఆక్రమణలో ఉన్నాయని బీజేపీ నేతలు తెలిపారు. ఆ భూములను కూడా వెలికితీసి పేదలకు దక్కేలా చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. పేదల హక్కుల కోసం బీజేపీ ఎల్లప్పుడూ ముందుంటుందని ఈ విజయం మరోసారి నిరూపించిందని నాయకులు పేర్కొన్నారు.


