అర్హులైన వీధి విక్రయదారుల గుర్తింపుకు జీవీఎంసీ చర్యలు
అపోహలు, వదంతులు, అసత్య ప్రచారాలను నమ్మవద్దు.

అర్హులైన వీధి విక్రయదారుల గుర్తింపుకు జీవీఎంసీ చర్యలు.
అపోహలు, వదంతులు, అసత్య ప్రచారాలను నమ్మవద్దు.
– యూ.సీ.డి ప్రాజెక్ట్ డైరెక్టర్ పి.ఎం. సత్యవేణి .

విశాఖపట్నం: విశాఖపట్నం నగరపాలక సంస్థ ఆపరేషన్ లంగ్స్ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. పాదచార మార్గాలు, రహదారులు, ముఖ్య కూడళ్లలోని తాత్కాలిక ఆక్రమణలను తొలగించి ప్రజల రక్షణ, సౌకర్యాలను కల్పించడం ఒక వైపు జరుగుతుండగా, మరోవైపు వీధి విక్రయదారుల సంక్షేమం కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేపడుతోందని, జీవీఎంసీ అర్హులైన వీధి విక్రయదారులను గుర్తించి వారికి వ్యాపార అవకాశాలు, జీవనోపాధి ప్రయోజనాలు కల్పించే చర్యలు తీసుకుంటోందని ,ఈ కార్యక్రమంపై ఎటువంటి అపోహలు, వదంతులు, అసత్య ప్రచారం నమ్మవద్దని యూ.సీ.డి ప్రాజెక్ట్ డైరెక్టర్ పి.ఎం. సత్యవేణి వీధి విక్రయదారులు, ప్రజలకు మంగళవారం పత్రికా ప్రకటన ద్వారా విజ్ఞప్తి చేశారు.
ఈ దిశగా కమిషనర్ ఆదేశాల మేరకు జోనల్ కమిషనర్లు ఇప్పటికే జోనల్ కార్యాలయాలలో వీధి విక్రయదారుల కమిటీ సభ్యులతో సమావేశాలు నిర్వహించారన్నారు. ఆపరేషన్ లంగ్స్ ముఖ్య ఉద్దేశ్యం నగర పరిశుభ్రత, రక్షణతో పాటు ప్రజలు, పాదచారులు, వాహనదారులకు సౌకర్యాలు కల్పించడం, అలాగే వీధి విక్రయదారుల వ్యాపార ప్రయోజనాలను కాపాడుతూ వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే వెసులుబాటు కల్పిస్తామని ఆమె తెలిపారు.
ఈ ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వీధి విక్రయదారుల చట్టం మరియు వీధి విక్రయ విధాన మార్గదర్శకాల్లో అర్హులుగా గుర్తింపు పొందిన వారికి ప్రత్యామ్నాయ సౌకర్యాలు కల్పిస్తామని ప్రాజెక్ట్ డైరెక్టర్ తెలిపారు.
ఇప్పటికే నగరంలో 21 విక్రయ జోన్లను టౌన్ ప్లానింగ్ శాఖ గుర్తించి ప్రభుత్వానికి నివేదించిందని, అదనంగా మరిన్ని విక్రయ జోన్లను గుర్తించి ప్రభుత్వానికి ప్రతిపాదిస్తున్నామని ఆమె పేర్కొన్నారు.
ఆపరేషన్ లంగ్స్లో భాగంగా ఆక్రమణల తొలగింపు విషయమై ఎటువంటి అపోహలు, వదంతులు, అసత్య ప్రచారం నమ్మవద్దని ప్రజలు, వీధి విక్రయదారులకు ప్రాజెక్ట్ డైరెక్టర్ విజ్ఞప్తి చేశారు.

