విశాఖ,ఉక్కునగరం అక్టోబర్ (పున్నమి ప్రతినిధి)
విశాఖ ఉక్కు పరిశ్రమ (RINL) ఆధ్వర్యంలో జరుగుతున్న “విజిలెన్స్ అవేర్నెస్ వీక్” కార్యక్రమంలో భాగంగా, ఉక్కునగరంలో ఒక విభిన్నమైన సృజనాత్మక ప్రదర్శన ఆకట్టుకుంది. శ్రిష్టి వరల్డ్ స్కూల్ విద్యార్థులు ప్రజల్లో అప్రమత్తత (Vigilance) పై అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో “వీధి నాటిక (Street Play)” ప్రదర్శించారు. ఈ కార్యక్రమం శ్రిష్టి వరల్డ్ స్కూల్ వ్యవస్థాపకులు మరియు డైరెక్టర్ శ్రీమతి పి. సుశీల రాణి గారి మార్గదర్శకత్వంలో, తెలుగు విభాగం మరియు క్రియేటివ్ టీమ్ సమన్వయంతో నిర్వహించబడింది. విద్యార్థులు తమ ప్రతిభను, నటనను, సందేశాత్మక సంభాషణలను చక్కగా మేళవించి, “విజిలెన్స్ అనేది ప్రతి పౌరుడి బాధ్యత” అనే స్పూర్తిదాయక సందేశాన్ని ప్రేక్షకుల మనసుల్లో నాటారు. నిజాయితీ, నైతికత, మరియు బాధ్యతతో వ్యవహరించడం ద్వారా మాత్రమే సమాజంలో పారదర్శకత నెలకొంటుందని నాటిక ద్వారా విద్యార్థులు స్పష్టంగా తెలియజేశారు. ఈ ప్రదర్శనకు ప్రేక్షకుల నుండి విశేషమైన ప్రశంసలు లభించాయి. విద్యార్థుల ఉత్సాహం, సృజనాత్మకత, సమకాలీనత – ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆర్ఐఎన్ఎల్ నిర్వహించిన ఈ కార్యక్రమం, విజిలెన్స్ వారంలో భాగంగా సమాజంలో అప్రమత్తతకు, నిజాయితీకి ప్రాధాన్యం పెంపొందించే దిశగా విజయవంతమైన అడుగుగా నిలిచింది.


