విశాఖ, జనవరి – (పున్నమి ప్రతినిధి)
విశాఖ నగరంలో సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఒక వైపు షాపింగ్ మాల్స్, జ్యువెలరీ షాపులు జనంతో కిటకిటలాడుతుండగా, మరో వైపు గుట్టుగా జూదం, కోడి పందేలు జోరుగా కొనసాగుతున్నాయి. నగర పరిధిలోని కంచెరపాలెం డీఎల్బీ గ్రౌండ్స్ వద్ద కోడి పందేలు నిర్వహిస్తున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు ఆదివారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 10 మంది జూదరాయుళ్లను అరెస్టు చేసి, రెండు కోడి పుంజులను స్వాధీనం చేసుకున్నారు. పండుగలను అడ్డుగా పెట్టుకుని అక్రమ జూదాలు, కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఇలాంటి కార్యకలాపాలను సహించేది లేదని స్పష్టం చేశారు.



