*విశాఖపట్నం లో జరిగిన వాల్తేర్ డివిజన్ పార్లమెంట్ సభ్యుల కమిటీ సమావేశం*
*రైల్వే అభివృద్ధి, ప్రయాణికుల సౌకర్యాల విస్తరణే లక్ష్యం అని తెలిపిన రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ అనకాపల్లి పార్లమెంటు సభ్యులు డాక్టర్ సి.ఎం రమేష్*
*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి*
ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేర్ డివిజన్ పార్లమెంట్ సభ్యుల కమిటీ సమావేశంమంగళవారం విశాఖపట్నం నోవోటల్ హోటల్ నందు జరిగింది.ఈ సమావేశానికి రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్, అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సి.ఎం. రమేష్ గారు ప్రధానంగా హాజరై మాట్లాడారు.సివిల్ ఏవియేషన్ శాఖా కేంద్ర మంత్రి శ్రీ కింజరాపు రామమోహన్ నాయుడు గారు అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో ఈస్ట్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ పర్మేశ్వర్ ఫంక్వాల్, డివిజనల్ రైల్వే మేనేజర్ శ్రీ లలిత్ బోహ్రా, అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్ (ఇన్ఫ్రాస్ట్రక్చర్) శ్రీ ఈ. సంతరాం,అలాగే ఎంపీలు మరియు అధికారులు పాల్గొన్నారు.
సమావేశంలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన పది మంది గౌరవ సభ్యులు పాల్గొన్నారు.వారిలో రాజ్యసభ సభ్యులు శ్రీ గోల్ల బాబురావు,
అరకు ఎంపీ డా. జి. తనుజా రాణి,విజయనగరం ఎంపీ శ్రీ కే. అప్పాలనాయుడు, కొరాపుట్ ఎంపీ శ్రీ సప్తగిరి శంకర్ ఉలక,బస్తర్ ఎంపీ శ్రీ మహేశ్ కాశ్యప్ గారు పాల్గొన్నారు.
సమావేశంలో చైర్మన్ సి.ఎం. రమేష్ గారు మాట్లాడుతూ
“వాల్తేర్ డివిజన్ పరిధిలో రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రయాణికుల సౌకర్యాల విస్తరణ, సేవల ప్రమాణం పెంపు అత్యంత అవసరం. కొత్త రైళ్లు, పెరిగిన డిమాండ్కి అనుగుణంగా ఫ్రీక్వెన్సీ పెంపు, స్టేషన్ల ఆధునికీకరణ, బ్రిడ్జ్లు, లైన్ల విస్తరణ వంటి అంశాలను ప్రాధాన్యతగా తీసుకోవాలి. అభివృద్ధి పనులు సమయానికి పూర్తవుతూ ప్రజలకు నేరుగా ఉపయోగపడేలా ఉండాలి” అని తెలిపారు.అలాగే ఆయన, వాల్తేర్ డివిజన్ పరిధిలోని అనకాపల్లి, విశాఖ, శ్రీకాకుళం ప్రాంతాల్లో అమృత్ భారత్ స్టేషన్లు, నూతన లైన్ల నిర్మాణం, డబ్లింగ్, ట్రిప్లింగ్, రోడ్ ఓవర్ బ్రిడ్జ్లు (ROBs), రోడ్ అండర్ బ్రిడ్జ్లు (RUBs) వంటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని కోరారు.
ఎంపీలు అందరూ రైల్వే అభివృద్ధి పట్ల తమ సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. వాల్తేర్ డివిజన్ ఇప్పటికే చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను అభినందిస్తూ, కొత్త సర్వీసులు ప్రారంభించడం, సౌకర్యాల పెంపు వంటి అంశాలపై చర్చించారు.
*సమావేశంలో చర్చించిన ప్రధాన అంశాలు*
* అమృత్ భారత్ స్టేషన్ల నిర్మాణం*
* అరకు, కొరాపుట్, జగదల్పూర్, రాయగడ, శ్రీకాకుళం ప్రాంతాల నుంచి కొత్త రైలు సర్వీసుల ప్రారంభం
* చెన్నై, బెంగళూరు, తిరుపతి వంటి నగరాలకు రైళ్ల ఫ్రీక్వెన్సీ పెంపు
* ఉన్న సర్వీసుల పొడిగింపు, కొత్త లైన్లు, డబ్లింగ్, ట్రిప్లింగ్, ఫోర్త్ లైన్ ప్రాజెక్టులు
* కొత్త రోడ్ ఓవర్ బ్రిడ్జ్లు (ROBs), రోడ్ అండర్ బ్రిడ్జ్లు (RUBs) నిర్మాణం
సమావేశంలో ఈస్ట్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ పర్మేశ్వర్ ఫంక్వాల్ గారు రైల్వే పనితీరు, అభివృద్ధి ప్రాజెక్టులు, ప్రయాణికుల సేవల మెరుగుదలపై సమగ్ర వివరణ ఇచ్చారు. డివిజనల్ రైల్వే మేనేజర్ శ్రీ లలిత్ బోహ్రా గారు డివిజన్ అభివృద్ధి కార్యకలాపాలు, ఆర్థిక సంవత్సరం ప్రగతి, అమృత్ భారత్ స్టేషన్ల పురోగతిపై వివరించారు.ఎంపీల సూచనలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ వాటిని త్వరితగతిన అమలు చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు.


