ఖమ్మం మార్చి
(పున్నమి జిల్లా ఇంచార్జి)
విజయ డెయిరీ బ్రాండ్ పేరుతో కల్తీ నెయ్యి తెలంగాణ మార్కెట్లో విక్రయాలు జరుగుతున్నాయంటూ తెలంగాణ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ప్రైవేట్ వ్యక్తులు విజయ బ్రాండ్ను దుర్వినియోగం చేస్తూ గుజరాత్ నుంచి నెయ్యిని తీసుకువచ్చి తెలంగాణలో విక్రయిస్తున్నారని ఆయన వెల్లడించారు.
మేఘన ఫుడ్స్ అనే సంస్థకు విజయ డెయిరీ ఫ్రాంచైజీ ఇవ్వగా, ఆ సంస్థ గుజరాత్లోని కన్హాన్ డెయిరీ నుంచి నెయ్యి సేకరించి తెలంగాణలో అమ్మకాలు సాగిస్తున్నట్లు తెలిపారు. ఈ నెయ్యిలో వెజిటేబుల్ ఆయిల్ కలిసినట్లు నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్ (NDDB) నివేదికలో తేలిందని పేర్కొన్నారు.
హైదరాబాద్ మార్కెట్లో విజయ డెయిరీ బ్రాండ్ పేరుతో నెలకు 100 టన్నులకు పైగా నెయ్యి విక్రయాలు జరుగుతున్నాయని అంచనా ఉందన్నారు. తెలంగాణలో విజయ డెయిరీకి ఉన్న విశ్వాసాన్ని ఆసరాగా చేసుకుని కొన్ని ప్రైవేట్ యూనియన్లు తక్కువ నాణ్యత గల పాలను విక్రయిస్తున్నాయని మండిపడ్డారు.
ఏపీకి చెందిన డెయిరీ సంస్థలు ఈ విధంగా వ్యాపారం నిర్వహించడం వల్ల తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ పాడి రైతులకు రావాల్సిన ఆదాయం దెబ్బతింటోందని ఆయన అన్నారు. ప్రస్తుతం APDDCFకు లీటర్ పాలు అమ్మకాలపై కేవలం రూ.1 మాత్రమే రాయల్టీగా వస్తోందని, దీనివల్ల రైతులు మరియు సహకార సంఘాలకు పెద్దగా లాభం లేకపోతుందని వివరించారు.
డెయిరీ ఫెడరేషన్ నిబంధనల ప్రకారం ప్రభుత్వ బ్రాండ్లను ప్రైవేట్ వ్యక్తులు వినియోగించుకోవడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఈ అంశంపై ఏపీ డెయిరీకి పలుమార్లు లేఖలు రాసినా స్పందన రాకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేశారు.



