
ఆపదలో ఉండే వారిని ఆదుకోవటం, అద్వైత భావన కలిగిస్తుందని మెహర్ బాబా సేవకులు బరాటం.వరప్రసాద్ అన్నారు. స్థానిక హాయతి నగరానికి చెందిన దువ్వు.ఈశ్వర్ వృత్తిరీత్యా ఆటో చోదకులుకాగా, అనివార్య కారణాలతో నడవలేని స్థితికి చేరుకున్నారు. తండ్రి నారాయణ దినసరి కూలీ కావటంతో ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా మూడు చక్రాల కుర్చీ కోసం ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ నంది ఉమా శంకర్ సహాయం కోరారు. ఆయన వాట్సాప్ స్టేటస్ కు స్పందించిన దాత, న్యూ కోలనీకి చెందిన మెహర్ బాబా సేవకులు బరాటం.వరప్రసాద్ ముందుకు వచ్చి చక్రాల కుర్చీని, లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ప్రెసిడెంట్ డా.పైడి.సింధూర చేతుల మీదుగా బాధితునికి అందించారు. ఈ సందర్భంగా లయన్ డా.పైడి.సింధూర మాట్లాడుతూ చక్రాల కుర్చీ దాత వరప్రసాద్ కు కృతజ్ఞతలని, నగరంలో మెహర్ బాబా పేరిట ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని, మెహర్ బాబా సేవకునిగా ఈ రోజు చేసిన సేవకు ధన్యవాదాలన్నారు. అనంతరం బాధితునికి ఉచిత వైద్యపరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను ఉచితంగా అందించారు. ఈ కార్యక్రమంలో బాధితుడు దువ్వు ఈశ్వర్, సహాయకుడు ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ నంది ఉమా శంకర్, లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ప్రతినిధి పొడుగు.చరణ్ తదితరులు పాల్గొన్నారు.

