విశాఖపట్నం, ఫిబ్రవరి 17, పున్నమి ప్రతినిధి.
విశాఖ స్టీల్ కార్మికుల వార్నింగ్ లెటర్స్ ను యాజమాన్యం ఉపసంహరించుకోవాలని స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు యాజమాన్యాన్ని హెచ్చరించారు. స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వార్నింగ్ లెటర్స్ ఉపసంహరించుకోవాలన్న ప్రధాన డిమాండ్ తో మంగళవారం స్మృత్యాంజలి పార్కు వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం యాజమాన్యానికి వినతి పత్రం అందజేశారు.
ఈ ధర్నాను ఉద్దేశించి స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ స్టీల్ యాజమాన్యం అనైతికంగా స్టీల్ కార్మికుల జీతభత్యాలను ఉత్పత్తి ఆధారంగా చెల్లింపులు కొనసాగించడం అత్యంత దుర్మార్గమని వారు అన్నారు. దీనిని కొనసాగించకూడదని రీజనల్ లేబర్ కమిషనర్, డిపిఈ చెప్పినప్పటికీ యాజమాన్యం ఆచరించలేదు. నేడు కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా సమ్మెలో 25 కోట్ల మంది కార్మిక వర్గం పాల్గొన్నారు. ఆ సమ్మెకు మద్దతుగా ఉత్పత్తికి ఎటువంటి అంతరాయం కలగకుండా స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాల ప్రతినిధులు ఈ సమ్మెకు మద్దతు తెలియజేశారు. అటువంటి వారికి నేడు స్టీల్ యాజమాన్యం వార్నింగ్ లెటర్స్ ఇవ్వాలని నిర్ణయించడం అత్యంత దుర్మార్గమని అన్నారు. నేడు యాజమాన్యం ఆర్ ఎల్ సి, డి పి ఈ వారి ఆదేశాలను పాటించకుండా వారు చెప్పారని నేడు వార్నింగ్ లెటర్స్ ఇవ్వడం హాస్యాస్పదమని వారు ఎద్దేవా చేశారు. ఈ సమ్మె ను యాజమాన్యానికి నిర్ణీత కాలవ్యవధిలోనే తెలియజేశామని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. యాజమాన్యం తన మొండి వైఖరిని కొనసాగిస్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని వారు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు డి ఆదినారాయణ, పి వి రమణమూర్తి, జె అయోధ్యరామ్, దొమ్మేటి అప్పారావు, దాసరి సురేష్ బాబు, యు రామస్వామి, జె రామకృష్ణ, ఎల్ వి రమణ, డొక్కా నర్సింగరావు, పి శ్రీనివాసరాజు, నగేష్ తదితరులతో పాటు వివిధ విభాగాల అధ్యక్ష కార్యదర్శులు మరియు కార్మికులు పాల్గొన్నారు.


