పోతుగల్ గ్రామంలో అప్పుల భారాన్ని తట్టుకోలేక రైతు అనమేని ఆంజనేయులు (42) ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యులు మరియు స్థానికుల వివరాల ప్రకారం, ఆయన భార్య రజిత (35) వ్యవసాయ కూలీగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వీరికి కుమారుడు చరణ్ (11), కుమార్తె సహస్ర, అలాగే మానసిక వికలాంగురాలైన మరో కుమార్తె (6) ఉన్నారు.
కుమార్తె అనారోగ్య సమస్యల కారణంగా కుటుంబంపై తీవ్ర ఆర్థిక భారం పడింది. చికిత్స ఖర్చులు, జీవనోపాధి కోసం తీసుకున్న అప్పులు పెరిగిపోవడంతో ఆంజనేయులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. స్వగ్రామంలో సరైన ఉపాధి లేకపోవడంతో జీవనోపాధి కోసం హైదరాబాద్ నగరానికి వెళ్లి ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నారు.
అయితే అప్పుల ఒత్తిడి, కుటుంబ ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఈరోజు సాయంత్రం సుమారు నాలుగు గంటల సమయంలో ఆంజనేయులు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.
ఈ ఘటనతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రైతులపై పెరుగుతున్న అప్పుల భారం, సరైన ఉపాధి అవకాశాల లేమి కారణంగా ఇలాంటి విషాద ఘటనలు పునరావృతమవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.



