*రెవెన్యూలో అభ్యంతరాల పరిష్కారానికి రెండేళ్ల గడువు*
*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి*
*విశాఖలో శాసన సభాపక్ష ఫిర్యాదుల కమిటీ ఛైర్మన్ రఘురామ కృష్ణరాజు
*ప్రైవేటు స్థలాల వివాదాలను పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్లకు అధికారాలు
విశాఖపట్టణం, నవంబర్ 21 ః భూ సంబంధిత రెవెన్యూ పరమైన సమస్యలపై రైతుల నుంచి వచ్చే అభ్యంతరాల పరిష్కారానికి రెండేళ్ల గడువు అవసరమని, ఆ మేరకు చట్టపరమైన నిర్ణయం తీసుకునేలా ప్రభుత్వానికి నివేదిస్తామని రాష్ట్ర శాసన సభాపక్ష ఫిర్యాదుల కమిటీ ఛైర్మన్, డిప్యూటీ స్పీకర్ కె. రఘురామ కృష్ణరాజు తెలిపారు. సభ్యులు కొణతాల రామకృష్ణ, పల్లా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజులతో కలిసి శుక్రవారం విశాఖపట్టణంలో పర్యటించిన ఆయన కలెక్టరేట్ వీసీ హాలులో విలేకరులతో మాట్లాడారు. సమగ్ర భూ రీసర్వే అంశంపై అధికారులతో చర్చించిన అంశాలు, కమిటీ చేసిన ప్రతిపాదనల గురించి వివరించారు. రీ-సర్వే లేదా ఇతర రెవెన్యూ పరమైన అంశాల్లో రైతులు చేసే అభ్యంతరాల పరిష్కారానికి తహశీల్దార్ స్థాయిలో ఉన్న ఏడాది కాలం పరిమితిని, మరొక ఏడాది పాటు అనగా రెండు సంవత్సరాలకు పెంచాలని సూచిస్తూ కమిటీ ప్రతిపాదించిందన్నారు. ఏడాది కాల పరిమితి దాటిపోతే రైతులు సివిల్ కోర్టులను ఆశ్రయించాల్సి ఉందని, దీనివల్ల చాలా మంది రైతులు ఇబ్బందులు పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, కావున అభ్యంతరాల పరిష్కార గడువును పెంచాలని ప్రతిపాదించినట్లు స్పష్టం చేశారు. సీసీఎల్ఏ దృష్టికి తీసుకెళ్లి ఆచరణలో పెట్టేందుకు చర్యలు తీసుకొనేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే ప్రయివేటు భూముల వివాదాల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ కు అధికారాలు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ రాలేదని త్వరితగతిన అమల్లోకి వచ్చేలా ఉన్నతాధికారులతో చర్చిస్తామని ఛైర్మన్ పేర్కొన్నారు.
*6,688 గ్రామాల్లో రీ-సర్వే పూర్తయింది… 2,093 గ్రామాల్లో కొనసాగుతోంది ః డైరెక్టర్*
విలేకరుల అడిగిన ప్రశ్నలకు బదులుగా రీసర్వేకు సంబంధించిన వివరాలను సర్వే అండ్ ల్యాండ్ రికార్డుల విభాగం డైరెక్టర్ ఆర్. కూర్మనాథ్ వివరించారు. ఇప్పటి వరకు 6,688 గ్రామాల్లో రీసర్వే పూర్తయిందని, అక్కడ సుమారు 7 లక్షల వరకు అభ్యంతరాలు వచ్చాయని, అందులో మూడు లక్షల వరకు సంక్లిష్టమైనవని.. జాయింట్ ఎల్.పి.ఎం., నాలుగు లక్షల వరకు పరిష్కరించడానికి వీలుగా ఉన్నవని పేర్కొన్నారు. ఇప్పటి వరకు రెండు లక్ష్యల అభ్యంతరాలను పరిష్కరించామని, మిగిలిన రెండు లక్షల అభ్యంతరాలకు 2025, డిసెంబర్ 31లోగా పరిష్కారం చూపుతామని చెప్పారు. 4,400 ఫిర్యాదులు కోర్టుల పరిధిలో ఉన్నాయన్నారు. మూడో విడతలో భాగంగా 2025, జనవరి 20వ తేదీ నుంచి 2,093 గ్రామాల్లో రీ-సర్వే మొదలు పెట్టామని, 628 పైలెట్ గ్రామాలను తీసుకున్నామని చెప్పారు. ఫేజ్ -2లో 740 గ్రామాలు, ఫేజ్-3లో 720 గ్రామాలను ఎంపిక చేశామని వివరించారు. మిగిలిన మరొక 7,200 గ్రామాల్లో కూడా రీసర్వేను పూర్తి చేస్తామని పేర్కొన్నారు. 2027, డిసెంబర్ 31 నాటికి అన్ని గ్రామాల్లో రీసర్వే పూర్తి చేస్తాం. గ్రామీణంలో స్వామిత్వ ద్వారా, పట్టణాల పరిధిలో నక్ష ద్వారా సర్వే ప్రక్రియలను కొనసాగిస్తామని తెలిపారు. రీ-సర్వేలో కార్స్ నెట్వర్కును వినియోగిస్తున్నామని చెప్పారు. సుమారు 44,000 ఎల్.పి.ఎం.లను ఫ్రీ హోల్డ్ భూములకు సంబంధించినవిగా గుర్తించామని, దీనిపై ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా తుది చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.


