ఆగస్టు 17 పున్నమి ప్రతినిధి :
రెండు,మూడు పథకాలతోనే సంబరాలొద్దు
మిగిలిన వాటిిపై ప్రజలు ప్రశ్నిస్తారు జాగ్రత్త
కూటమి సర్కార్ కు గెడ్డం చంద్రశేఖర్ హెచ్చరిక
అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా సూపర్ సిక్స్ లో కేవలం మూడంటే మూడు హామీలను అమలు చేసి మొత్తం తన ఎన్నికల మేనిఫెస్టోనే అమలు చేసేసినట్లు కూటమి సర్కార్ సంబరాలు చేసుకొంటోందని వైసీపీ కార్యకర్త గెడ్డం చంద్రశేఖర్ విమర్శించారు. సూపర్ సిక్స్ లో ఇంకా మిగిలిన హామీలను కూటమి సర్కార్ విస్మరించినా ప్రజలు మాత్రం గుర్తుపెట్టుకొంటారని, వాటిని కూడా అమలు చేయకపోతే ఎన్నికల్లో ఓటమితో గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన సమయంలో రెండేళ్లు కరోనా కారణంగా ఆర్థిక పరిస్థితి స్థంభించిపోయినా మూడేళ్లలోని చేసిన హామీలతోపాటు చేయని హామీలను కూడా వైయస్ జగన్ అమలు చేసి చూపించారని ఆయన గుర్తుచేశారు. అందుకే ఇపుడు వైయస్ జగన్ ను రాష్ట్ర ప్రజలు గుర్తుచేసుకొంటున్నారని, కూటమి సూపర్ సిక్స్ హామీలకు మోసపోయామన్న భావనతో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఎన్నికలు ఎపుడొస్తాయా కూటమి సర్కార్ ఎపుడు ఓడిస్తామా అని ప్రజలే ఇపుడు ఆత్రుత్తగా ఎదురు చూస్తున్నారని ఆయన విమర్శించారు. ఎన్నికల హామీల అమలుకు వైయస్ జగన్ తరహా సంకల్పం కావాలి, ప్రజలను మభ్యపెట్టి తప్పించుకొనే తన నైజాన్ని చంద్రబాబు మరోసారి బయటపెట్టుకొన్నారని వైసీపీ కార్యకర్త గెడ్డం చంద్రశేఖర్ విమర్శించారు.


