ఈ నెల 14, 15వ తేదీల్లో విశాఖపట్టణం వేదికగా జరగనున్న ప్రపంచ స్థాయి భాగస్వామ్య సదస్సు రాష్ట్ర భవిష్యత్తుకు తలమానికం కానుందని, ఈ మహా కార్యాన్ని దిగ్విజయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశల కృషి చేస్తోందని జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి, ఐటీ శాఖ మంత్రి, ఇతర కేబినెట్ మంత్రులు పలు దేశాల్లో పర్యటించి పారిశ్రామిక వేత్తలను, పెట్టుబడిదారులను ఆహ్వానించారని గుర్తు చేశారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను స్థానిక ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్, ఇతర అధికారులతో కలిసి బుధవారం ఆయన పరిశీలించారు. ఈ క్రమంలో మీడియాతో పలు అంశాలపై మాట్లాడారు. ప్రపంచ స్థాయి భాగస్వామ్య సదస్సును దిగ్విజయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం, అధికార యంత్రాంగం పటిష్ట చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. సుమారు 40 పైచిలుకు దేశాల నుంచి వందల సంఖ్యలో అతిథులు, వివిద కంపెనీల ప్రతినిధులు విచ్చేస్తున్నారని తెలిపారు. సదస్సు నిర్వహించటం ద్వారా రాష్ట్రానికి రూ.9.8 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి స్వామి పేర్కొన్నారు. తద్వారా 7.5 లక్షల మంది యువతకు ఉద్యోగావకాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రకారం 20 లక్షల ఉద్యోగాల కల్పనలో భాగంగా ఇప్పటికే 10 లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పించే ప్రక్రియలను పూర్తి చేశామని చెప్పారు. దేశ, విదేశాల నుంచి వచ్చే పారిశ్రామిక వేత్తలు, రాజకీయ, అధికార ప్రముఖుల సమక్షంలో 410 ఒప్పందాలు జరుగుతాయని, 2.7 లక్షల కోట్లతో చేపట్టనున్న ప్రాజెక్టులు శంకుస్థాపనలు కూడా జరుగుతాయని మంత్రి వివరించారు. విశాఖపట్టణాన్ని పూర్తిస్థాయి ఆర్థిక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా మంత్రి ఉద్ఘాటించారు. ఏయూలో జరుగుతున్న ఏర్పాట్లు, వేదికలు, ఇతర అంశాలను జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ మంత్రికి, ఇతర ప్రజా ప్రతినిధులకు మ్యాప్ సహాయంతో వివరించారు.
పర్యటనలో మంత్రితో పాటు ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణ బాబు, వంశీకృష్ణ శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు, మేయర్ పీలా శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, జిల్లా కలెక్టర్, సీఐఐ ప్రతినిధి మౌళి, ఇతర అధికారులు ఉన్నారు.


