ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడం లక్ష్యంగా ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. మాడుగుల నియోజకవర్గంలోని కె.కోటపాడు మండలం చౌడువాడ, మాడుగుల మండలం కింతలి ప్రాంతాల్లో నిర్మించిన 33/11 కె.వి. విద్యుత్ ఉపకేంద్రాలు పలు అభివృద్ధి పథకాలను ఆయన పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి లతో కలిసి ప్రారంభించారు.
చౌడువాడ గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ —
జిల్లాకు 10 సబ్స్టేషన్లు మంజూరు చేసినట్లు, అందులో మాడుగుల నియోజకవర్గానికి రెండు సబ్స్టేషన్లు, అదనంగా మరొక సబ్స్టేషన్ కూడా మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఏపీ ఈపీడీసీఎల్ పరిధిలోని 11 జిల్లాల్లో రూ.250 కోట్లతో 69 సబ్స్టేషన్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు.
జిల్లాలో 20 వేల ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ఇళ్లలో సోలార్ విద్యుత్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరు పీఎం సూర్యఘర్ పథకం ప్రయోజనాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
రూ.3.65 కోట్లు వ్యయంతో నిర్మించిన చౌడువాడ ఉపకేంద్రం ద్వారా కె.కోటపాడు మండలంలోని 9 గ్రామాలు చోడవరం మండలంలోని పలు ప్రాంతాలు నాణ్యమైన విద్యుత్ సరఫరాతో లబ్ధి పొందనున్నాయని తెలిపారు. దీని ద్వారా తాత్కాలిక విద్యుత్ అంతరాయాలు, తక్కువ వోల్టేజ్ సమస్యలు గణనీయంగా తగ్గుతాయని వివరించారు.
గత ప్రభుత్వం విధించిన ఎఫ్పీపీ చార్జీలలో 40 పైసలలో 13 పైసలు తగ్గించి, ఆర్థిక ప్రయోజనాలను నేరుగా వినియోగదారులకు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయని, రూ.35 వేల కోట్లతో 65 లక్షల మందికి పెన్షన్లు, రూ.10 వేల కోట్లతో తల్లికి వందనం పథకం కొనసాగుతోందని వివరించారు.
సీఎం రమేష్ మాట్లాడుతూ జిల్లాను పరిశ్రమల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని, మాడుగుల నియోజకవర్గంలో 2 వేల ఎకరాలను పరిశ్రమల స్థాపనకు గుర్తించినట్లు తెలిపారు. దీంతో సుమారు 6 వేల యువకులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని, విద్యా అభివృద్ధికి యూనివర్సిటీ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అన్నారు.
ఏపీ ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి మాట్లాడుతూ జిల్లాకు మంజూరైన 10 సబ్స్టేషన్లలో ఐదు నిర్మాణం పూర్తి చేసినట్లు తెలిపారు. పరిశ్రమలతో పాటు వ్యవసాయం, గిరిజన ప్రాంతాలకు నిరంతర విద్యుత్ సరఫరా చేయడానికి చర్యలు చేపడుతున్నామని చెప్పారు.
జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ మాట్లాడుతూ ఉత్తమ పంచాయతీ అవార్డు సాధించిన చౌడువాడలో విద్యుత్ ఉపకేంద్రం ఏర్పాటు చేయడం సంతోషకరమని, దీని ద్వారా విద్యుత్ సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు.
శాసనసభ్యుడు బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ రెండు సబ్స్టేషన్లు మంజూరు చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. దేవరాపల్లి ప్రాంతానికి మరో సబ్స్టేషన్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, నియోజకవర్గంలో పాలిటెక్నిక్ మరియు ఇంజనీరింగ్ కళాశాలలు స్థాపనకు చర్యలు తీసుకోవాలని కోరారు.
కార్యక్రమంలో ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి, ఎంఎల్ఏ కె.ఎస్.ఎన్.రాజు, ఏపీ ఈపీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ జి.ప్రసాద్, గ్రామ సర్పంచ్ దాడి ఏరుకు నాయుడు, డీఈలు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


