విశాఖపట్నం, యారాడ (పున్నమి ప్రతినిధి):
విశాఖపట్నంలోని యారాడ బీచ్ వద్ద సోమవారం ఉదయం సముద్ర ఒడ్డుకు భారీ తిమింగలం కొట్టుకొచ్చి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది . తీరానికి చేరుకున్న తిమింగలాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలనలు చేపట్టారు.
పోలీసుల ప్రాథమిక అంచనాల ప్రకారం మృతి చెందిన తిమింగలం సుమారు 350 కిలోల బరువు, దాదాపు 15 అడుగుల పొడవు (వెడల్పు) ఉన్నట్లు భావిస్తున్నారు. అలల తీవ్రత లేదా ఆరోగ్య సమస్యల కారణంగా తిమింగలం సముద్రం నుంచి ఒడ్డుకు కొట్టుకువచ్చి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.
ఈ అరుదైన దృశ్యాన్ని చూసేందుకు పర్యాటకులు, స్థానికులు పెద్ద సంఖ్యలో యారాడ బీచ్కు తరలివచ్చారు. భద్రతా చర్యల దృష్ట్యా పోలీసులు జనాన్ని నియంత్రిస్తూ, అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. తిమింగలం మృతిపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు అటవీ శాఖ, మత్స్య శాఖ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.


