తుఫాన్ ప్రభావం దృష్ట్యా ప్రజల ప్రాణాలు, ఆస్తులను రక్షించేందుకు జిల్లా పోలీసులు విస్తృతమైన చర్యలు చేపట్టారు. గొలుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని డొంకాడ గ్రామం ప్రధాన రహదారి (తారు రోడ్) నుండి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉండగా, వర్షాల కారణంగా రోడ్డు కనెక్టివిటీ పూర్తిగా తెగిపోయింది.
ఈ గ్రామంలో సుమారు 35 కుటుంబాలు (మొత్తం 120 మంది) మట్టితో చేసిన గుడిసెలలో నివసిస్తున్నారు. తుఫాన్, వర్షాల కారణంగా గుడిసెలు దెబ్బతినే అవకాశం ఉండటంతో, గొలుగొండ ఎస్సై పి.రామారావు గారు, గ్రామ రెవెన్యూ అధికారి (VRO) మరియు సిబ్బందితో కలిసి గ్రామాన్ని సందర్శించి, ప్రజలను నచ్చజెప్పి సమీపంలోని కరకా గ్రామ సైక్లోన్ సెంటర్కి సురక్షితంగా తరలించారు.
ప్రజల భద్రత కోసం సమయానుకూలంగా చర్యలు తీసుకున్న పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ అభినందించారు. తుఫాన్ సమయంలో ఎవరూ నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని, స్థానిక అధికారులు మరియు పోలీసుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని ఆయన ప్రజలను కోరారు.


