మొంథా (Montha) తుఫాను హెచ్చరిక ల నేపధ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి.
కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు.
కలెక్టర్ హరేందిర ప్రసాద్.
*విశాఖపట్నం,అక్టోబర్ పున్నమి ప్రతినిధి*: మంతా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ MN హరేందిర ప్రసాద్ ఆదేశించారు.శనివారం జిల్లా, మండల,జోనల్ అధికారులతో కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగాళాఖాతంలో అల్పపీడనం (తుఫాన్) కారణంగా రాబోయే 72 గంటలు (3 రోజులు) అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కోవడానికి అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలన్నారు.ఆస్తి, ప్రాణ, పశు , పంట నష్టం జరగ కుండా అధికార యంత్రాంగం అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జిల్లా, డివిజన్, మండల ,గ్రామ స్థాయి అధికార యంత్రాంగం అంతా పనిచేసే ప్రదేశాల్లోనే (హెడ్ క్వార్టర్స్ లో) ఉండాలని, హెడ్ క్వార్టర్స్ వదలి వెళ్ళ రాదని అన్నారు.ఉద్యోగులకు ఎలాంటి సెలవులు మంజూరు చేయరాదని తెలిపారు.
మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకుండా చూడాలన్నారు. ఇప్పటికే ఎవరైనా సముద్రంలోకి వెళ్లి ఉంటే ఒడ్డుకు చేరుకోవడానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
తుఫాను వల్ల భారీ వర్షాలు , పెనుగాలులు వచ్చే అవకాశం ఉన్నందున నది ఒడ్డులో, కొండ వాలులలో, నీటిమంపుకు గురయ్యే పల్లపు ప్రాంతాల్లో ప్రాంతాల్లో ఉండే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.
పల్లపు ప్రాంతాల్లో నీరు చేరితే వెంటనే నీటి తొలగింపునకు అన్ని ఏర్పాట్లు చేయాలని తెలిపారు.
అధికారులు రిలీఫ్ సెంటర్ల ఏర్పాటుకు సిద్ధంగా ఉండాలని.
చెట్లు పడిపోతే వెంటనే తొలగించడానికి ఏర్పాట్లు చేసుకోవాలని అన్నారు.
త్రాగునీటికి ఇబ్బందులు రాకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని,విద్యుత్ కి అంతరాయం కలిగితే వెంటనే పునరుద్ధరించడానికి చర్యలు చేపట్టాలన్నారు. జనరేటర్లు, డీజిల్ అందుబాటు లో సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. PHC లలో డాక్టర్లు,వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని, ఎన్.డి.ఆర్.ఎఫ్, ఎస్.డి.ఆర్.ఎఫ్. టీమ్ లను సిద్ధంగా ఉంచాలని తెలిపారు.
జిల్లా కలెక్టరేట్లో 0891-2590102, 0891- 2590100 నెంబర్లతో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసి, షిఫ్ట్ ల వారీగా సిబ్బందిని నియమించామని, తుఫాను సమయంలో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి సహాయం పొందవచ్చని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా, మండల అధికారులు పాల్గొన్నారు.


