డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అల్లవరం మండలం ఓడలరేవు గ్రామంలోని మొంథా తుఫాన్ బాధితుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సందర్శించారు. బాధితులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తక్షణ సాయంగా నిర్వాసిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు, 25 కిలోల బియ్యం మరియు ఒక్కో కుటుంబానికి రూ.3 వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేసిందని బాధితులు వివరించారు.
తరువాత సీఎం చంద్రబాబు అరగట్లపాలెం మరియు బెండమూరులంక గ్రామాలకు వెళ్లి వరద నీటిలో మునిగిపోయిన పంట పొలాలను స్వయంగా పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను విన్నారు. తుఫాన్ కారణంగా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని గుర్తించి, వీలైనంత త్వరగా పంట నష్టాన్ని అంచనా వేసి రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.
ప్రజల ఆపదలో ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సీఎం తెలిపారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు అధికారులను ఆదేశించారు. ప్రజల భద్రత, పంటల పునరుద్ధరణ, మరియు సాధారణ జీవన స్థితిని త్వరగా సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.


