నందిగామ మండలం మునగచర్ల గ్రామంలో బుధవారం సామాజిక భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధ, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని), జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు పాల్గొన్నారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కూటమి నేతలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ, సామాజిక భరోసా పెన్షన్లు పేదలు, వృద్ధులు, వికలాంగులు, విధవలకు ఆర్థిక భరోసాగా నిలుస్తున్నాయని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందుకే ప్రజల వద్దకే వెళ్లి సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజల గడప దాటే పాలన ద్వారా ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం మరింత పెరుగుతోందని, గ్రామాల్లో సంక్షేమం మరియు అభివృద్ధి సమాంతరంగా కొనసాగుతున్నాయని ఆమె అన్నారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు బచ్చుల సుబ్రహ్మణ్యం బోస్, గ్రామ సర్పంచ్ పంగులూరి నరసింహారావు, వ్యవసాయ మార్కెట్ కమిటీల రాష్ట్ర ఉపాధ్యక్షులు కోగంటి వెంకట సత్యనారాయణ బాబు, వార్డు సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కూటమి నేతలు, అధికారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.




