రైల్వే కోడూరు పట్టణంలోని ఆర్యవైశ్య భవనంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రైల్వే కోడూరు నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్, కూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి సతీమణి ముక్కా వరలక్ష్మి, యువనేత ముక్కా సాయి వికాస్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ముక్కా వరలక్ష్మి మాట్లాడుతూ మహిళా సాధికారతే సమాజ అభివృద్ధికి పునాదిగా నిలుస్తుందని అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగుతూ సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. మహిళలకు విద్య, ఉపాధి అవకాశాలు పెరిగినప్పుడే సమాజం మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. మహిళా సాధికారత కోసం ప్రభుత్వం, సమాజం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మహిళల కృషి, త్యాగాలను గుర్తు చేసే ప్రత్యేక దినమని పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు స్వర్గీయ నందమూరి తారక రామారావు పునాది వేసిన నాయకుడని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం నేతృత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళల అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని పేర్కొన్నారు.డ్వాక్రా మహిళల రుణ పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచినట్లు తెలిపారు. ఎస్సీ–ఎస్టీ మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నట్లు చెప్పారు. “తల్లికి వందనం” పథకం ద్వారా 67 లక్షల మంది తల్లులకు రూ.10 వేల కోట్లను నేరుగా వారి ఖాతాల్లో జమ చేసినట్లు వివరించారు. ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి పథకాలు మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని అన్నారు. మహిళల భద్రత, ఆరోగ్యం, విద్యకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.అనంతరం మహిళా దినోత్సవం సందర్భంగా ముక్కా వరలక్ష్మిని శాలువా కప్పి, మొమెంటో అందజేసి సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీడీవో, రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర, మార్కెట్ కమిటీ చైర్మన్ పగడాల వరలక్ష్మి, మహిళలు, ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.




