విశాఖ గాజువాక జనవరి (పున్నమి ప్రతినిధి)
గాజువాక నియోజకవర్గం 88వ వార్డ్ మంగలంపాలెంలో జివిఎంసీ ఆధ్వర్యంలో చేపట్టనున్న అభివృద్ధి పనులకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు సంయుక్తంగా శంకుస్థాపన చేశారు. స్థానిక వార్డు కార్పొరేటర్ మొల్లి ముత్యాల నాయుడు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకే కూటమి ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ప్రతి వార్డును సమగ్రంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. మంగలంపాలెం వార్డులో క్రైస్తవ, ముస్లిం సోదరులకు వేరువేరుగా స్మశాన వాటికలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే పిల్లలు, మహిళల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కొత్త అంగనవాడి కేంద్రం, ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండే రేషన్ డిపోను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి ప్రసాదుల శ్రీనివాస్, కాలనీ టీడీపీ అధ్యక్షులు ముమ్మడివరపు రాము, స్థానిక నాయకులు బాబా, రాజు, శ్రీను తదితరులు పాల్గొని అభివృద్ధి కార్యక్రమాలకు మద్దతు తెలిపారు.
Uploaded Video:





