రైల్వేకోడూరు సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి)
అన్నమయ్య జిల్లా, రైల్వే కోడూరు నియోజకవర్గం పరిధిలోని ఐదు మండలాల్లో రైతులు వేసిన సుమారు 15 వేల ఎకరాల బొప్పాయి పంట ఇప్పుడు తీవ్ర సమస్యల్లో చిక్కుకుంది. గత ఒకటిన్నర నెలుగా గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు.ప్రారంభంలో క్వింటాల్కు రూ.16 ఇచ్చిన దళారులు, సిండికేట్గా వ్యవహరించి ధరను క్రమంగా రూ.7కు తగ్గించడంతో రైతులు ఆందోళనకు దిగారు. కలెక్టర్ జోక్యం చేసుకొని, ఆగస్టు 1 నుంచి 5 వరకు రూ.9, ఆపై రూ.10గా కొనుగోలు చేయాలని ఆదేశించారు. అయితే, నిర్ణయం కేవలం వారం రోజుల పాటు మాత్రమే అమలై, మళ్లీ ధరను రూ.7కి తగ్గించారు.రైతుల ఆందోళనలపై సబ్ కలెక్టర్ మరోసారి జోక్యం చేసుకొని కనీసం రూ.9కి కొనాలని హెచ్చరించగా, వారం రోజులు ఆ ధర కొనసాగింది. అయితే ఆగస్టు 26న రైతుల అంచనాలను తారుమారు చేస్తూ ధరను కేవలం రూ.5కి తగ్గించారు.రైతులు కనీసం రూ.15 గిట్టుబాటు ధర లేకపోతే అప్పుల కూరుకుపోయే పరిస్థితి తప్పదని చెబుతున్నారు. కలెక్టర్ నిర్ణయించిన రూ.10ను తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
సెప్టెంబర్ 2న రాజంపేట సబ్ కలెక్టర్ రైతు సంఘ ప్రతినిధులను కలెక్టర్ వద్దకు తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదు. దాంతో ఈరోజు రైతులు సమ్మెకు దిగారు. కోడూరులో బొప్పాయి బండ్లు మార్కెట్కు రాకుండా నిరసన చేస్తున్నారు.ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకొని మార్క్ఫెడ్ ద్వారా నేరుగా కొనుగోలు చేయాలని, దళారుల వ్యవస్థను రద్దు చేసి లైసెన్స్ విధానం అమలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
రైతుల సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలుపుతూ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, సీఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్ ప్రకటన విడుదల చేశారు.


