•చిన్న గాయానికి వెళ్లి శవంగా బయటకు వచ్చిన వెంకట్రావు
•కేజీహెచ్లో ప్రత్యేక కమిటీతో పోస్టుమార్టం
•డాక్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కుటుంబ సభ్యుల డిమాండ్
•డాక్టర్ల అరెస్టు వరకు పోరాటం ఆపమంటున్న కుటుంబ సభ్యులు
విశాఖపట్నం,ఫిబ్రవరి (పున్నమి ప్రతినిధి)
కాలికి స్వల్ప గాయం కావడంతో ఆసుపత్రికి వెళ్లిన స్థానిక పత్రికల పంపిణీదారుడు కె.వెంకట్రావు(65)ప్రాణాలు కోల్పోవడం నగరంలో కలకలం రేపింది.గోపాలపట్నంలోని బెహరా ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం,తప్పుడు చికిత్సే ఈ మరణానికి కారణమని కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేశారు.ఘటనపై గోపాలపట్నం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కాగా,మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కింగ్ జార్జ్ హాస్పిటల్ (KGH) మార్చూరీకి తరలించారు.వేపగుంట ప్రాంతానికి చెందిన వెంకట్రావు శనివారం ద్విచక్రవాహనంపై వెళ్తుండగా జారి పడిపోయి కాలికి గాయమైంది.కుటుంబ సభ్యులు వెంటనే గోపాలపట్నంలోని బెహరా ఆసుపత్రికి తరలించగా ఆర్థోపెడిక్ వైద్యుడు చిన్నపాటి శస్త్రచికిత్స అవసరమని చెప్పినట్లు తెలిపారు.సోమవారం మధ్యాహ్నం ఆపరేషన్ థియేటర్కు తీసుకెళ్లిన తర్వాత గంట వ్యవధిలోనే మృతిచెందినట్లు ప్రకటించారని మృతుని కుమారుడు కె.శ్యామ్ ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు.“మత్తుమందు ఇచ్చామని,శరీరం సహకరించడం లేదని చెప్పారు.మరో గంటలో చనిపోయాడని ప్రకటించారు.ఆపరేషన్ ముందు అన్ని పరీక్షలు బాగున్నాయని చెప్పి చివరికి ప్రాణం తీసేశారు”అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.మత్తుమందు మోతాదుకు మించి ఇవ్వడమే మృతికి కారణమై ఉంటుందని,మత్తు ఇచ్చిన వైద్యుడు అర్హత కలిగిన అనస్థీషియా నిపుణుడా కాదా అనేది తేల్చాలని డిమాండ్ చేశారు.మరణించిన వెంటనే సమాచారం ఇవ్వకుండా రెండు గంటలపాటు రహస్యంగా ఉంచారని,ఆసుపత్రి యాజమాన్యాన్ని ప్రశ్నించగా“ఎవరికి చెప్పుకోవాలో చెప్పుకోండి…కేసు పెట్టుకోండి”అంటూ దురుసుగా ప్రవర్తించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు.సంబంధిత డాక్టర్లు,యాజమాన్యంపై హత్యాయత్నం సహా క్రిమినల్ కేసులు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.ఫిర్యాదు చేసినప్పటికీ తొలుత పోలీసుల నుంచి స్పందన రాలేదని,ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన తర్వాతే కేసు నమోదు చేసినట్లు సమాచారం.ఈ ఘటనపై పోలీస్ కమిషనర్ డా.శంక బ్రత బాగ్చి ప్రత్యేక వైద్యుల కమిటీతో పోస్టుమార్టం నిర్వహించాలని ఆదేశించారు.ఫోరెన్సిక్,పాథాలజీ,అనస్థీషియా,ఆర్థోపెడిక్ శాఖల నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసి పోస్టుమార్టం చేపట్టారు.అలాగే జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్ ను కలిసిన బాధితులు ఆసుపత్రిపై సమగ్ర దర్యాప్తు చేయాలని కోరగా సంబంధిత అధికారులకు తక్షణ విచారణకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.చిన్న గాయానికి చికిత్స కోసం వెళ్లిన ఓ సాధారణ పత్రిక పంపిణీదారుడు ప్రాణాలు కోల్పోవడం నగర వైద్య వ్యవస్థపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది.పోస్టుమార్టం నివేదిక వెలువడిన తర్వాతే అసలు నిజాలు బయటపడనున్నాయి.





