పువ్వాడ నాగేంద్ర కుమార్
(పున్నమి ప్రత్యేక ప్రతినిధి)
ఖమ్మం జిల్లా లోని
సత్తుపల్లిలో ఇటీవల జరిగిన బీసీ రిజర్వేషన్ బంద్ సందర్భంగా చోటుచేసుకున్న ఉద్రిక్తతలపై విచారణ కోసం తెలంగాణ బీజేపీ రాష్ట్ర శాఖ ప్రత్యేక త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. అక్టోబర్ 18న ఖమ్మం జిల్లాలో బీసీ రిజర్వేషన్ బంద్ అనంతరం సత్తుపల్లి పట్టణంలోని డీఈ ఆఫీస్ వద్ద బీజేపీ నాయకులు అధికారులను కలవడానికి వెళ్తుండగా, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అడ్డగించి దాడికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా బీజేపీ నేతలపై అబద్ధపు అట్రాసిటీ కేసులు నమోదు చేసినట్లు బీజేపీ పేర్కొంది.
ఈ ఘటనపై నిజానిజాలు తెలుసుకునేందుకు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జి. కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. వీ. ఉమాశంకర్ సంతకం చేసిన ప్రకటనలో త్రిసభ్య కమిటీని ప్రకటించారు.
ఈ కమిటీలో మాజీ ఎంపీ శ్రీ సీతారాం నాయక్, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఆనంద్ గౌడ్, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ క్రాంతి కిరణ్ సభ్యులుగా ఉన్నారు.
కమిటీ సభ్యులు రేపు ఉదయం 11 గంటల ప్రాంతంలో సత్తుపల్లి పట్టణాన్ని సందర్శించి, అక్కడ జరిగిన వాస్తవ సంఘటనలను ప్రత్యక్షంగా పరిశీలించి, బాధిత బీజేపీ నాయకులతో, స్థానిక పోలీసు అధికారులతో సమావేశమై నివేదికను రాష్ట్ర నాయకత్వానికి సమర్పించనున్నారు.
ఈ సందర్భంగా బీజేపీ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడు సుదర్శన మిశ్రా మాట్లాడుతూ, సత్తుపల్లి నియోజకవర్గం లోని బీజేపీ మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు కమిటీ పర్యటనలో తప్పకుండా పాల్గొని సంఘటనల వివరాలను తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.
బీజేపీ నాయకులపై అక్రమ కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్య వ్యతిరేక చర్య అని పేర్కొంటూ, నిజమైన న్యాయం జరిగే వరకు పార్టీ నిశ్శబ్దంగా ఉండబోదని బీజేపీ నాయకత్వం స్పష్టం చేసింది.


