*బి.ఆర్. అంబేద్కర్ స్టడీ సర్కిల్ తనిఖీ చేసిన ఇన్చార్జ్ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి*
*విశాఖపట్నం,నవంబర్ పున్నమి ప్రతినిధి:-* ప్రభుత్వం అందించే కోచింగ్ సద్వినియోగం చేసుకొని బాగా చదివి సమాజంలో మంచి పేరు, ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ, వికలాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ మరియు జిల్లా ఇన్చార్జి మంత్రి వర్యులు డా.డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి విద్యార్థులకు సూచించారు. బుధవారం మధ్యాహ్నం ఋషికొండ వద్ద గల బి.ఆర్. అంబేద్కర్ స్టడీ సర్కిల్ ను సందర్శించారు. ఈ సందర్భంగా లైబ్రరీ, కంప్యూటర్ రూమ్, సెమినార్ హాల్ తదితర వసతులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టడీ సర్కిల్లో కోచింగ్ పొందుతున్న విద్యార్థులతో మంత్రి మాట్లాడుతూ తీసుకునే కోచింగ్ సద్వినియోగం చేసుకొని బాగా చదివి సమాజంలో మంచి పేరు, ప్రఖ్యాతులు సంపాదించాలని సూచించారు. విద్యార్థుల వసతి, పాఠశాల వాతావరణం తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులు నివసిస్తున్న హాస్టల్ను పరిశీలించి, వసతులు మరింత మెరుగుపరచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. స్టడీ సర్కిల్ చుట్టూ ఉన్న ప్రాంగణాన్ని శుభ్రపరచి మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. చివరగా విద్యార్థిని విద్యార్థులతో ఫోటోలు దిగారు.
ఈ కార్యక్రమంలో డీడీ సోషల్ వెల్ఫేర్ రామారావు, జిల్లా గురుకుల పాఠశాల కోఆర్డినేటర్ మిసెస్ గ్రేస్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


