*బయట తినే టిఫిన్ ప్రియులకు షాక్… దోశ, పూరి, వడలకు కొన్ని రోజులు కష్టమే*
పున్నమి న్యూస్ ప్రతినిధి
11 మార్చ్ 2026
ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావంతో వంట గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతున్న నేపథ్యంలో హైదరాబాద్లోని పలు హోటళ్లు, పీజీ హాస్టళ్లు, మెస్లు తమ మెనూలో మార్పులు చేస్తున్నారు. గ్యాస్ కొరతతో పాటు ధరలు పెరగడం కారణంగా ఎక్కువ సమయం పట్టే మరియు ఎక్కువ నూనె అవసరమయ్యే దోశ, పూరి, వడ, చపాతీ, టీ, కాఫీ వంటి టిఫిన్ ఐటెంలను తాత్కాలికంగా నిలిపివేయాలని హైదరాబాద్ ఐటీ కారిడార్ హోటళ్ల అసోసియేషన్ ప్రకటించింది. దీంతో బయట టిఫిన్ తినే వారికి కొంత ఇబ్బంది కలగనుంది.
ప్రస్తుతం పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కొన్ని హోటళ్లు మెనూను కుదించి అన్నం, సాంబార్, పప్పు, రసం వంటి త్వరగా తయారయ్యే వంటకాలను మాత్రమే వడ్డిస్తున్నాయి. ఇదే పరిస్థితి పీజీ హాస్టళ్లు, మెస్లలో కూడా కనిపిస్తోంది. గ్యాస్ సరఫరా సమస్య మరో రెండు మూడు రోజులు కొనసాగితే కొన్నిచోట్ల హాస్టళ్లను తాత్కాలికంగా మూసివేయాల్సి వస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు.
ఇదిలా ఉండగా రవాణా ఛార్జీలు మరియు ముడి సరుకుల ధరలు పెరగడంతో కొన్ని హోటళ్లు టిఫిన్ ధరలను కూడా పెంచాయి. దోశ, పూరి, వడలపై కనీసం రూ.15 వరకు, ఇడ్లీ, ఉప్మా వంటి వాటిపై రూ.10 వరకు ధరలు పెరిగినట్లు సమాచారం. గ్యాస్ సరఫరా సాధారణ స్థితికి వస్తే మళ్లీ మెనూ కూడా యథావిధిగా కొనసాగుతుందని హోటల్ నిర్వాహకులు తెలిపారు.


