ఖమ్మం మార్చి
(పున్నమి జిల్లా ఇంచార్జి )
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అలాగే ఖమ్మం
నగరంలో టిఫిన్ సెంటర్లు నుంచి పెద్ద పెద్ద హోటళ్ల వరకు వినియోగదారుల ఆరోగ్యంపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పలు హోటళ్లు, బిర్యానీ పాయింట్లు రోజులు తరబడి నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను కస్టమర్లకు అందిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి ఫుడ్ ఇన్స్పెక్టర్ల పర్యవేక్షణ లోపమే కారణమని ప్రజలు విమర్శిస్తున్నారు.
ప్రస్తుతం అనేక బిర్యానీ పాయింట్లలో రోజు ల తరబడి నిల్వ ఉంచిన గ్రేవీ, పెరుగు చట్నీ వంటి పదార్థాలను మళ్లీ వేడి చేసి వినియోగదారులకు అందిస్తున్నట్లు సమాచారం. అలాగే కొన్ని టిఫిన్ సెంటర్లలో సాంబార్, చట్నీలు మాత్రమే కాకుండా పిండితో తయారయ్యే కొన్ని ఆహార పదార్థాలను కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంచి వాడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి.
ఈ పరిస్థితుల వల్ల ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇలాంటి పాత ఆహారాన్ని తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్, జీర్ణ సమస్యలు వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కొంతమంది హోటల్ యజమానులు తనిఖీలను తప్పించుకోవడానికి మామూలు ఇచ్చి ఫుడ్ ఇన్స్పెక్టర్లను ప్రభావితం చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ కారణంగా తనిఖీలు సక్రమంగా జరగడం లేదని స్థానికులు చెబుతున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇప్పటికైనా అప్రమత్తం కావాలని ప్రజలు కోరుతున్నారు. నగరంలోని టిఫిన్ సెంటర్లు, బిర్యానీ పాయింట్లు, హోటళ్లపై అకస్మాత్తుగా తనిఖీలు నిర్వహించి నాణ్యతలేని ఆహారాన్ని విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రజల ఆరోగ్యం దృష్ట్యా అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకుంటారా లేదా అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారినది.



